రెండురోజులూ ప్లీనరీలోనే వైఎస్ జగన్: వేదిక వద్దే క్యాంప్ ఆఫీస్: సీఎం సంతకంతో ఇన్విటేషన్
గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్లీనరీ నిర్వహణ పనుల్లో తలమునకలైంది. ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల్లో ప్లీనరీలు ముగిశాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జులై 8వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ రాష్ట్రస్థాయి ప్లీనరీని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తోన్నాయి. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని అధికార పార్టీ భావిస్తోంది.
మూడోసారి..
పార్టీ ఆవిర్భవించిన తరువాత వైఎస్ఆర్సీపీ నిర్వహించబోతోన్న మూడో ప్లీనరీ ఇది. ఇదివరకు 2011లో కడప జిల్లా ఇడుపులపాయ, 2017లో గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో దీన్ని నిర్వహించింది. మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి ప్లీనరీ ఇదే కావడం వల్ల దీన్ని పార్టీ యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ప్లీనరీని నిర్వహించనుంది. దీనికోసం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.
వర్షం పడకుండా జర్మన్ హ్యాంగర్..
వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ప్రత్యేకంగా జర్మన్ హ్యాంగర్ను సభా ప్రాంగణంలో నిర్మిస్తోన్నారు పార్టీ నాయకులు. ఇది రెయిన్ ప్రూఫ్. 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల ఎత్తుతో వేదిక నిర్మాణం సాగుతోంది. ప్లీనరీ నిర్వహించే 8,9 తేదీల్లో ఆరు లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉన్నందున.. దానికి అనుగుణంగా ఏర్పాట్లు ఉంటోన్నాయి.
రెండ్రోజులూ ప్లీనరీలోనే
ఈ రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్లీనరీలోనే ఉండబోతోన్నారు. 8వ తేదీన పార్టీ జెండాను ఆవిష్కరించినప్పటి నుంచీ.. ఆ మరుసటి రోజు ముగింపు ప్రసంగం వరకు ఆయన ప్లీనరీలోనే ఉంటారు. దీనికోసం సభా ప్రాంగణం వెనుక ప్రత్యేకంగా తాత్కాలిక క్యాంప్ కార్యాలయాన్ని నిర్మిస్తోన్నారు. అధికారిక కార్యక్రమాలు, శాఖలవారీగా సమీక్షా సమావేశాలను ఆయన ఇక్కడి నుంచే కొనసాగిస్తారు. అన్ని శాఖల మంత్రులు ప్లీనరీలోనే అందుబాటులో ఉండనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్ జగన్ సంతకంతో..
పార్టీ ప్లీనరీకి హాజరయ్యే నాయకులు, కార్యకర్తల కోసం ఆహ్వానపత్రికను సిద్ధం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రతి కార్యకర్తకు వైఎస్ జగన్ సంతకం చేసిన ఆహ్వాన పత్రికను పంపించనున్నారు. ఈ ఆహ్వాన పత్రిక సిద్ధమైంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తోన్న వలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, ఇతర సంక్షేమ పథకాలను ఈ ఆహ్వాన పత్రికలో ముద్రించారు.
మరింత చేరువ కావడానికి..
2019 అనంతరం ఎదుర్కొన్న అన్ని ఎన్నికల్లో పార్టీ ఘన విజయాన్ని సాధించిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. స్థానిక సంస్థలతో పాటు లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలుపొందడానికి పార్టీ కార్యకర్తలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి పార్టీ తరఫున ఇంకా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందనే విషయంపై ఈ ప్లీనరీలో చర్చిస్తామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై, తమ అభిప్రాయాలను తెలియజేయాలని వైఎస్ జగన్ ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.