పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి స్థానంలో హోంగార్డ్??
పల్నాడు ఎస్పీ రవిశంకర్రెడ్డి తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాచర్లలో వైసీపీ అరాచక శక్తులకు ఎస్పీ సహకరిస్తున్నారని బాబు ఆరోపించారు. రవిశంకర్ రెడ్డిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పల్నాడు ఎస్పీ స్థానంలో హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థవంతంగా పనిచేస్తారనే నమ్మకం తమకుందన్నారు. ఇటువంటి అధికారులతో పోలీసు విభాగానికే తలవంపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్పీ రవిశంకర్ మాచర్ల ఘటనలపై స్పందించారు. స్పందిస్తూ.. మాచర్లలో జరిగినవి చిన్నచిన్న ఘటనలేనని వ్యాఖ్యానించారు. గతంలో కిరాయి హత్యలు చేసినవారు, ఫ్యాక్షన్ చరిత్ర కలిగినవారు ఉన్నారనే సమాచారంతో ఏడోవార్డులో తనిఖీలు చేసినా ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అన్న కార్యక్రమాన్ని కొందరు నిర్వహించారని, అందులో పాల్గొన్నవారికి ఫ్యాక్షనిజంతో సంబంధముందని చెప్పుకొచ్చారు. రెండు వర్గాలు పరస్పరం ఎదురుపడి మాట్లాడుకోవడమే వివాదానికి దారితీసిందని రవిశంకర్ రెడ్డి చెప్పారు. దీనిపై తెలుగుదేశం పార్టీ వర్గాలు భగ్గుమన్నాయి. జరిగిన సంఘటనను చిన్నది చేసి చూపించేందుకు ఎస్పీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు సరిగా సాగదని, వీరు కేసులు కూడా ఏమీ తేల్చకుండా పెండింగ్ లో పెడతారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తామేంటో చూపిస్తామని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి.
మాచర్లలో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య వివాదం రేకెత్తింది. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకుల ఇళ్లపై యథేచ్ఛగా దాడికి పాల్పడ్డారు. పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడంతోపాటు మరో నాయకుడు ఎర్రం పోలిరెడ్డి ఇంట్లో రూ.లక్ష నగదుతోపాటు బంగారు ఆభరణాలు కూడా దోచుకెళ్లడంతో దీనిపై తమ దర్యాప్తులో తేలితేనే స్పందిస్తామని ఎస్పీ ప్రకటించారు. SP ప్రకటన ఫక్తు రాజకీయ నాయకుడి ప్రసంగంలా ఉందంటూ మాచర్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.