అమరావతిలో భూసేకరణపై రచ్చ..సీఎం జగన్ ఎస్టేట్ ఫొటోలతో లోకేశ్ ఎదురుదాడి.. పంచితే లక్షమందికి ఇళ్లు..
రాజధాని కోసం పోరాడుతోన్న అమరావతి రైతులను.. కొత్తగా 'భూసేకరణ' అస్త్రం ద్వారా భయపెట్టాలని వైసీపీ సర్కారు కుట్రలు చేస్తోందని, 'పేదలకు ఇళ్లు' పథకం పేరుతో సీఎం జగన్ మరో రివర్స్ డ్రామాకు తెరలేపారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సీఆర్డీఏ పరిధిలో 1251 ఎకరాల భూసేకరణకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని చెప్పారు. సీఎం జగన్ కు చెందిన ఎస్టేట్లు, ఖరీదైన భవంతుల తాలూకు ఫొటోలను బయటపెట్టిన ఆయన.. సర్కారుకు పలు సవాళ్లు విసిరారు.
Recommended Video

అసలేం జరిగిందంటే..
ఎన్నికలకు ముందు వైసీపీ ప్రకటించిన నవరత్నాల్లో ‘పేదలందరికీ ఇళ్లు' పథకం కూడా ఉంది. ఏడు నెలల కాలంలో వరుసగా ఒక్కో పథకాన్ని ఆవిష్కరిస్తూ వచ్చిన సీఎం జగన్.. ఉగాది నాటికి పేదలకు ఇళ్లు పథకాన్ని కూడా అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ భూమిని సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలోనూ సేకరణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. అయితే సీఆర్డీఏ పరిధిలో సర్కారు తీసుకోవాలనుకుంటున్న భూములు రైతుల పేరు మీద ఉండటంతో వివాదాం రేగింది.
1251 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్..
రాజధానిని తరలించొద్దంటూ అమరావతి రైతులు ఆందోళనలను చేస్తుండగానే.. సీఆర్డీఏ పరిధిలోని 1251 ఎకరాల భూసేకరణ కోసం మున్సిపల్ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. సీఆర్డీఏ పరిధిలో ఇళ్లులేని పేదలు మొత్తం 54వేల మంది ఉన్నారని, వాళ్లందరికీ ఇళ్లు కట్టివ్వడానికే 1251 ఎకరాలను సేకరిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనిపై నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రివర్స్ పనులకు పరాకాష్ట
సీఆర్డీఏ పరిధిలో వైసీపీ సర్కారు సేకరించాలనుకుంటున్న 1251 ఎకరాలు.. గతంలో పేదలకు పంచిన భూమేనని లోకేశ్ తెలిపారు. ‘‘టీడీపీ హయాంలో పేదవాళ్లకు పంచిన భూమినే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లాక్కుంటోంది. పేదలకు ఇళ్లు పథకం ద్వారా మళ్లీ ఇదే స్థలాన్ని పేదలకు ఇస్తామని చెబుతోంది. సీఎంగారి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పరాకాష్టకు చేరింది''అని విమర్శించారు.
జగన్ ఎస్టేట్లు రాసిస్తే..
కేవలం పేదలకు ఇళ్లు పథకానికి పేరు మార్చడం కోసం.. ప్రజలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్ని వైసీపీ సర్కారు లాగేసుకుంటున్నదని లోకేశ్ ఆరోపించారు. సీఆర్డీఏ పరిధిలో 1251 ఎకరాల ద్వారా 54వేల మందికి ఇళ్లు కట్టిస్తామంటున్న సీఎం జగన్.. తన సొంత ఎస్టేట్లు, ప్యాలెస్ లను ప్రభుత్వానికి రాసిస్తే కనీసం లక్ష మందికి ఇళ్ల స్థలాలు వస్తాయన్నారు. పులివెందుల, ఇడుపులపాయ, బెంగళూరులో జగన్కు చెందినవిగా ఎస్టేట్లు ఇవేనంటూ లోకేశ్ కొన్ని ఫొటోలు విడుదల చేశారు. ‘‘వేల ఎకరాలతో అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్ లు, ప్యాలెస్ లు ప్రభుత్వానికి ఇవ్వండి. లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు వస్తాయి''అని సవాలు విసిరారు. లోకేశ్ సవాలుపై వైసీపీ నేతలు స్పందించాల్సిఉంది.












Click it and Unblock the Notifications