మహిళలు స్నానం చేస్తోంటే ఫొటోలు తీస్తారా?: మా ఓర్పును చేతగానితనంగా: నారా లోకేష్ వార్నింగ్
గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సోమవారం గుంటూరు జిల్లా ఉప కారాగారాన్ని సందర్శించారు. జైలులో ఉన్న రాజధాని ప్రాంత రైతులను ఆయన పరామర్శించారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అమరావతి పరిరక్షణ కమిటీ ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు ఈ సందర్భంగా నారా లోకేష్ వెంట ఉన్నారు. సుమారు అరగంట పాటు వారంతా జైలులో గడిపారు. రైతులను పరామర్శించారు.
ప్రజల నోట్లో మట్టికొట్టారు: జగన్ ఇళ్ల ఫొటోలు పెట్టి దుమ్మెత్తిపోసిన నారా లోకేష్
అమరావతి ప్రాంత రైతులను అరెస్టు చేయడంపై
జైలులో ఉన్న అమరావతి ప్రాంత రైతులను పరామర్శించిన తరువాత.. వారు విలేెకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ 75 రోజులుగా నిరాటంకంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను నిర్వహిస్తోన్న రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తప్పు పట్టారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటోన్న జగన్ సర్కార్.. రైతుల పొట్ట కొడుతోందని ధ్వజమెత్తారు.
మహిళా రైతులను కించపరిచేలా..
అమరావతి ప్రాంతానికి చెందిన మహిళా రైతులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కించపరుస్తోందని, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తోందని నారా లోకేష్ ఆరోపించారు. మహిళా రైతులు స్నానం చేస్తోంటే.. డ్రోన్ల ద్వారా ఫొటోలు తీశారని విమర్శించారు. అదేమని ప్రశ్నించిన మహిళా రైతులపై కొందరు అధికారులు, డ్రోన్ ఆపరేటర్లు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. మహిళా రైతులను మానసికంగా దెబ్బతీయడం ద్వారా అమరావతి ప్రాంత ఉద్యమాన్ని నీరుగార్చడానికి కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఉద్యమాన్ని నడిపిస్తున్నది మహిళలేనని, అందుకే వారిపై సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పారు.
అమరావతి అంటే ఆది నుంచీ అక్కసే..
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ అమరావతి పట్ల అక్కసును, ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారని నారా లోకేష్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నగరాన్ని నిర్మించడానికి ఉదారంగా భూములను ఇచ్చిన రైతులను మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులుగా కించపరుస్తున్నారని అన్నారు. వేలాది ఎకరాలను ఇచ్చిన రైతులకు అన్యాయం చేసేలా అమరావతిని తరలించడాన్ని తాము అడ్డుకుని తీరుతామని చెప్పారు. తమ సహనాన్ని పరీక్షించ వద్దని, తమ ఓర్పును చేతగానితనంగా తీసుకోవద్దని నారా లోకేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విశాఖను, కర్నూలును అన్యాయం చేయరని గ్యారంటీ ఉందా?
33 వేల ఎకరాలను ఇచ్చిన అమరావతి రైతులకు వైఎస్ జగన్ అన్యాయం చేస్తున్నారని, ఇదే తరహాలో విశాఖపట్నం, కర్నూలు జిల్లావాసులను కూడా మోసం చేయరనే గ్యారంటీ ఉందా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. అయిదు కోట్ల మంది ఆంధ్రులు, మూడు ప్రాంతాల మధ్య విభేదాలను పెట్టడానికి వైఎస్ జగన్ రాజధానుల ఏర్పాటు పేరుతో మూడుముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై 300 మంది పులివెందుల రౌడీలను తీసుకొచ్చి మరీ దాడి చేయించారని ఆరోపించారు. తాము ఎక్కడైతే ఉద్యామన్ని ఆపామో.. అక్కడి నుంచే మళ్లీ మొదలు పెడతామని పేర్కొన్నారు.