Nara Lokesh: గుంటూరు జిల్లా జైలుకు నారా లోకేష్, గల్లా జయదేవ్..!
గుంటూరు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనల్లో పాల్గోన్న పలువురు రైతులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జిల్లాలోని చినకాకాని వద్ద అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేసిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా జైలుకు వెళ్లిన నేతలు..
జిల్లా జైలు ఉన్న అమరావతి ప్రాంత రైతులను బుధవారం ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్, గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి వెంట పలువురు జిల్లా పార్టీ నాయకులు ఉన్నారు. ఈ ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన నారా లోకేష్ నేరుగా గుంటూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే గల్లా జయదేవ్ కూడా పార్టీ కార్యాలయానికే వచ్చారు.

ఒక సామాజిక వర్గాన్ని ఇబ్బందులు పెట్టడానికే..
అనంతరం వారిద్దరూ కలిసి జిల్లా జైలుకు బయలుదేరి వెళ్లారు. జిల్లా జైలు వద్ద అప్పటికే టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు సహా కొందరు నాయకులు చేరుకున్నారు. అనంతరం వారంతా కలిసి జైలులో ఉన్న రైతులను పలకరించారు. ఈ సందర్భంగా నారా లోకేష్, గల్లా జయదేవ్ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం కక్షపూరిత ధోరణికి పాల్పడుతోందని ఆరోపించారు. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అమరావతిని తరలించడానికి కుట్ర పన్నిందని విమర్శించారు.

దిగొచ్చేంత వరకూ ఉద్యమం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ ఆందోళనలను విరమింపజేసేది లేదని నారా లోకేష్, గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరిస్తున్నారని, దీన్ని బట్టి చూస్తోంటే.. ప్రభుత్వానికి అన్నం పెట్టే రైతన్నల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమౌతోందని అన్నారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయపరమైన రాజధానిగా ప్రకటించడాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులు కూడా స్వాగతించట్లేదని చెప్పారు.

అదుపులో మరో 10 మంది..
ఇదిలావుండగా.. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై చినకాకాని వద్ద రాళ్లు రువ్వి, ఆయన గన్ మెన్ పై చేయి చేసుకున్న వారిని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ఛానళ్లు, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోల ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.












Click it and Unblock the Notifications