నాయీ బ్రాహ్మణులకు సంక్షేమ క్షవరం చేసిన జగన్ సర్కార్: చేదోడుతో కటింగ్: నారా లోకేష్
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొద్దిరోజుల కిందటే అఖిల భారత చేనేత బోర్డు, హస్తకళలు, పవర్లూమ్ బోర్డులను పునరుద్ధరించేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన ఆయన.. ఈ సారి నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం గళమెత్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాయీ బ్రాహ్మణులు వివక్షకు, నిరాదరణకు గురవుతున్నారని విమర్శించారు.
బుధవారం ప్రపంచ బార్బర్ల దినోత్సవం సందర్భంగా ఆయన నాయీ బ్రాహ్మణులకు శుభాకాంక్షలు తెలిపారు. నాయీ బ్రాహ్మణ కళలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఇదివరకు తమ ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందని పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేశామని అన్నారు. సెలూన్లను పరిశ్రమగా గుర్తించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. సెలూన్లు జీవనాధారం కోసం మాత్రమే కాదని.. ఒక పరిశ్రమలా ఎదగాలనే ఆలోచనతో అనేక ప్రణాళికలను రూపొందించి, అమలు చేశామని నారా లోకేష్ చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. అవన్నీ దూరం అయ్యాయని అన్నారు. ప్రభుత్వం పద్ధతి లేకుండా నాయీ బ్రాహ్మణులను మోసం చేస్తోందని మండిపడ్డారు. అధికార మార్పిడి తరువాత బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమై పోయిందని ధ్వజమెత్తారు. వెనుకబడిన వర్గాలు, చేతివృత్తిదారులను ప్రోత్సహించడానికి తాము అమలు చేసిన ఆదరణ పథకాన్ని జగన్ సర్కార్ రద్దు చేసిందని ఆరోపించారు.
Recommended Video
అయిదు లక్షల ప్రమాద బీమా పథకం పత్తా లేకుండా పోయిందని విమర్శించారు. నాయీ బ్రాహ్మణుల సంక్షేమ పథకంలో అర్హుల పేర్లను ఉద్దేశపూరకంగా తొలగించారని నారా లోకేష్ ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా అయిదున్నర లక్షల మందిలో కేవలం 38 వేల మందికి చేదోడు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. నాయీ బ్రాహ్మణులకే సంక్షేమ కటింగ్ చేశారని మండిపడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక సాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications