రజినీకాంత్ ఏది చేసిన సెన్సేషనే: రాజకీయాలకు శాశ్వతంగా గుడ్బై: ఏకంగా పార్టీ రద్దు
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తాను స్థాపించిన రజినీ మక్కల్ మండ్రం పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆలోచన లేనప్పుడు ఇక పార్టీని కొనసాగించడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. తను అభిమాన సంఘాలతో అన్ని కోణాల్లోనూ చర్చించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ స్థానంలో రజినీకాంత్ అభిమానుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆరోగ్య కారణాలేనా?
రజనీకాంత్ తాజాగా పార్టీ రద్దు చేయడానికి ప్రధాన కారణం.. ఆయన ఆరోగ్యమేనని తెలుస్తోంది. రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన గడువు దాటి పోయిందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికల ముగియడం, ఇక మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇంకా చాలా సమయం ఉండటం వల్ల అప్పటి వరకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుందని, ఇందుకు తన ఆరోగ్యం సహకరించకపోవచ్చని రజినీకాంత్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

అందరితోనూ చర్చించిన తరువాతే..
ఇదే విషయాన్ని ఆయన తన అభిమానుల వద్ద ప్రస్తావించారని, రాజకీయాల్లో గురువుగా భావిస్తోన్న ఒకరిద్దరు సీనియర్లతోనూ సంప్రదించారని తెలుస్తోంది. వారందరి అభిప్రాయాలను తీసుకున్న తరువాత.. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తమిళ మీడియా చెబుతోంది. దక్షిణాదిన కోట్లాదిమంది అభిమానులను ఆరాధ్యదైవంగా మారిన తలైవా రజినీకాంత్.. రాజకీయాల్లోనూ అదే స్థాయిలె రాణిస్తారని, ఒక సంచలనంగా మారతారని ఆశించిన సగటు అభిమానికి తాజా నిర్ణయం మింగుడుపడట్లేదు.

క్రియాశీలకంగా మారినా..
ఎన్నో ఆశలు పెట్టుకున్న రజినీకాంత్ తమను తీవ్ర నిరాశకు గురి చేశారని చెబుతోన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రజినీకాంత్ తన పార్టీ రజినీ మక్కల్ మండ్రం (RMM)ను క్రియాశీలకంగా మార్చారు. అభిమానులతో వరుస సమావేశాలను నిర్వహించారు. తన రాజకీయ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముహూర్తాన్ని కూడా నిర్ధారించారు. అదే సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్లోని ఫిల్మ్సిటీలో అన్నాత్తి మూవీ షూటింగ్ సమయంలో కరోనా వైరస్ బారిన పడ్డారు. దీనితో షూటింగ్ను అర్ధాంతరంగా రద్దు చేసి.. ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయారు. విశ్రాంతి తీసుకున్నారు.

నేడో రేపో.. సీఈసీకి లేఖ
రాజకీయ రంగ ప్రవేశం ప్రకటనను అధికారికంగా ప్రకటించాల్సిన రోజే.. ఆ నిర్ణయం నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. కొంత విరామం, విశ్రాంతి తరువాత.. తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులు, ఆప్తుల కోరిక మేరకు రాజకీయ రంగ ప్రవేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. రజినీకాంత్కు రాజకీయాల పట్ల ఆసక్తి లేదనే విషయం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. తాజా ప్రకటనతో అదికాస్తా వాస్తవ రూపాన్ని దాల్చింది. రజినీ మక్కల్ మండ్రం పార్టీని రద్దు చేసినట్లు నేడు రేపో.. ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారిక లేఖను రాస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications