ఆ 4 ప్రాంతాల్లోనే ఎక్కువ పాజిటివ్ కేసులు.. కొత్తగా మరో 13.. కరోనాపై ఈటెల రాజేందర్..
తెలంగాణలో శుక్రవారం (ఏప్రిల్ 24) 13 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదనట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 983కి చేరుకుందన్నారు. గురువారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500కు పైగా కరోనా టెస్టులు నిర్వహించామన్నారు. కరోనా నుంచి కోలుకుని గురువారం మరో 29 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇప్పటికే 262 మంది డిశ్చార్జ్ అయినట్లు గుర్తు చేశారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్మీట్లో ఈటెల ఈ వివరాలు వెల్లడించారు.
ఆ ఏడుగురికి ప్లాస్మా థెరపీ..
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో కరోనాతో 663 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపారు. ఇందులో ఏడుగురికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. ఆ ఏడుగురికి ప్లాస్మా థెరఫీ ద్వారా చికిత్స అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో నాలుగు ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని అన్నారు.
నాలుగు ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు
జీహెచ్ఎంసీ పరిధిలో 44 కుటుంబాల ద్వారా 265 మందికి కరోనా సోకిందన్నారు. వికారాబాద్లో 14 కుటుంబాల నుంచి కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి సోకిందన్నారు. గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మంది వైరస్ సోకిందన్నారు. గాంధీ ఆసుపత్రిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిని సంపూర్ణ కొవిడ్ ఆస్పత్రిగా మార్చామన్నారు. పాత ఫోటోలతో కొంతమంది దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. వైద్యులను వేధించినా, దాడులకు పాల్పడ్డా ఉపేక్షించేది లేదని మరోసారి హెచ్చరించారు.
మరో 10లక్షల పీపీఈ కిట్లు,మాస్కులకు ఆర్డర్..
కరోనా పేషెంట్లకు అందిస్తున్న పౌష్టికాహారంపై కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. కొన్ని పత్రికల్లోనూ తప్పుడు సమాచారం ప్రచురించి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విపత్కర సమయంలో అందరూ బాధ్యాతయుతంగా మెలగాలని హితవు పలికారు.సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా పేషెంట్లు ఎవరూ తమకు సరైన ఆహార,సదుపాయాలు లేవని ఫిర్యాదు చేసిన దాఖలా లేదన్నారు. అలాగే డిశ్చార్జి అయినవారెవరూ ట్రీట్మెంట్ పట్ల,సదుపాయాల పట్ల అసంతృప్తిగా లేరని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ వైద్యులకు కరోనా సోకలేదన్నారు. మరో 10 లక్షల పీపీఈ కిట్లు,10లక్షల ఎన్-95 మాస్కులకు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు.