తెలంగాణలో కొత్తగా మరో 27 కరోనా పాజిటివ్ కేసులు.. 970కి చేరిన సంఖ్య..
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం కొత్తగా మరో 27 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 13 మంది, గద్వాలలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 970కి చేరిందన్నారు. వీరిలో 262 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని.. 23 మంది మృతి చెందారని తెలిపారు.
ఇందులో 58 మంది ఈరోజే(ఏప్రిల్ 23) డిశ్చార్జి అయినట్టు తెలిపారు. ప్రస్తుతం 693 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయన్నారు.యాక్టివ్ కేసుల్లో అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి తెలిపారు.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు విఘాతం కలగవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు కరోనా ఆసుపత్రులపై మరోసారి సమీక్ష జరిపినట్టు తెలిపారు. గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్లు,సిబ్బందితో చర్చలు జరిపి.. అవసరమైన మరిన్ని చర్యలకు సలహాలు,సూచనలు చేయడం జరిగిందన్నారు.

హాట్ స్పాట్ కేంద్రాల్లో కఠినంగా ఆంక్షలు అమలుచేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో టెస్టులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. దేశంలో కేసులు రెట్టింపు కావడానికి 7.5 రోజులు పడుతుంటే.. తెలంగాణలో డబ్లింగ్ రేటు 12.5గా ఉందన్నారు. భారత్లో కరోనా సగటు డెట్ రేట్ 3.18శాతం కంటే తెలంగాణలో మెరుగ్గా 2.6శాతం ఉందన్నారు.రికవరీ రేట్ దేశంలో 19.9 శాతంగా ఉంటే.. తెలంగాణలో 22 శాతం ఉందన్నారు.
ఇప్పటివరకూ 4లక్షల పీపీఈ కిట్లు,4.50 ఎన్95 మాస్కులు తెప్పించినట్టు చెప్పారు. రాష్ట్రంలో కేవలం కంటైన్మెంట్ కేంద్రాల్లోనే ఎక్కువ కేసులు వస్తున్నాయని.. మిగతా ప్రాంతాల్లో కేసులు నమోదవడం లేదని అన్నారు. మరో నాలుగైదు రోజుల్లో కేసులు తగ్గుముఖం పడుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు 24గంటలు నిరంతరం పనిచేస్తున్నామన్నారు. తలసేమియా పేషెంట్లకు అందాల్సిన రక్తం కూడా కావాల్సిన స్థాయిలో ఉందని చెప్పారు. ఎవరికీ ఏ ఆపద వచ్చినా 104,108కి ఫోన్ చేయవచ్చునని చెప్పారు.












Click it and Unblock the Notifications