తెలంగాణలో కరోనా కలకలం.. 5 వందలకు చేరువలో కేసులు
కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టినా.. తెలంగాణలో మాత్రం మహమ్మారి కల్లోలం రేపుతోంది. కొవిడ్ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య 500 వందలకు చేరువలో ఉంది. గత 24 గంటల్లో 25,989 శాంపిల్స్ పరీక్షించగా, 477 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 258 కొత్త కేసులు నమోదయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో 100కి పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో ఒక్కరోజు వ్యవధిలో 107 కేసులు గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56 కేసులు వచ్చాయి. 279 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 7,99,532 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,91,461 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. 3,960 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 4,111 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు. కానీ చాలా మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు.