తెలంగాణలో కరోనా విలయం.. 35 మంది మృతి, ఆక్సిజన్ అందక 3 మృతి...
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నిచర్యలు చేపట్టిన ఫలితం కనిపించడం లేదు. కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ను విడుదల చేసింది. రాష్ట్రంలో 4,976 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,97,361 లక్షలకు చేరింది.
Recommended Video
4,28,865 లక్షల మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 65,757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 851, రంగారెడ్డి 417, మేడ్చల్లో 384 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా కరోనాతో 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,739కి చేరింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ మాస్క్, శానిటైజర్లు వాడాలని సూచించారు. కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరించారు.
ఇటు కింగ్కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ సమయానికి అందక రోగులు చనిపోయారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి రావాల్సిన ట్యాంకర్ ఆలస్యం కావడంతోనే ఘటన జరిగింది. ట్యాంకర్ డ్రైవర్ రూటు మర్చిపోవడంతో సమస్య తలెత్తింది. ఈలోపు ఆక్సిజన్ అందక ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమ వాళ్ల మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.