నాలుగు అంచెల భద్రత.. 5 వేల మందితో ప్రధాని మోడీ సభకు ప్రొటెక్షన్
ప్రధాని మోడీ రెండో రోజు హైదరాబాద్ పర్యటన కొనసాగుతోంది. నిన్న హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. నోవాటెల్లో బస చేశారు. మోడీ కోసం ఒక ఫ్లోర్ మొత్తం ఖాళీ చేయించారు. ఇటు ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మోడీ సభ జరుగుతుంది. ఐదు వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
భద్రతా వలయం..
ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాలు భద్రతా వలయంలో ఉన్నాయి. మోడీ భద్రతను ఎస్పీజీ పర్యవేక్షిస్తోంది. మోడీ పర్యటించే ప్రాంతాల్లో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీజీతోపాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీమ్స్ నిరంతరం భద్రతని పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమాల పరిధిలోని ప్రాంతాలు అన్నీ స్నైపర్స్, క్విక్ రెస్పాన్స్ బృందాలు, మఫ్టీ పార్టీల నిఘాలో ఉన్నాయి.
సిటీ పోలీసులు
ఎస్పీజీతోపాటు సిటీ పోలీసులు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని బస చేసే ప్రాంతంలో ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేశారు. అంతేకాదు డ్రోన్స్ ఎగరేయడంపై కూడా నిషేధం ఉంది. పరేడ్ గ్రౌండ్స్ పరిసర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పరేడ్ గ్రౌండ్స్ ఫ్లై ఓవర్ పూర్తిగా మూసేశారు. చుట్టు పక్కల బిల్డింగ్స్ను కూడా ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. బేగంపేట్ విమానాశ్రయం, హెచ్ఐసీసీ, నోవాటెల్, పరేడ్ గ్రౌండ్స్, రాజ్ భవన్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
మోడీ ఒక్కరికే
ప్రధాని మోడీ భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) పర్యవేక్షిస్తోంది. అంతకుముందు విపక్ష నేతలు, మాజీ ప్రధాని, గాంధీ కుటుంబం, హోం మంత్రికి కూడా ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇచ్చేది. కానీ దానిని మార్చివేశారు. కేవలం ప్రధానమంత్రి మోడీకి మాత్రమే ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 4 రోజుల ముందుగానే ఎస్పీజీ రంగంలోకి దిగుతుంది. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుంది.