ask ktr: ఆ 7 రోజులే కీలకం.. రికవరీ ఇలా.. వైద్యుడిలా మారిన కేటీఆర్
వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సగటు కన్నా తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యాక్సినేషన్ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. వ్యాక్సిన్ సరఫరాయే అతి పెద్ద అడ్డంకిగా నిలిచిందని కామెంట్ చేశారు. కరోనా నియంత్రణ, సంబంధిత అంశాలపై మంత్రి కేటీఆర్ 'ఆస్క్ కేటీఆర్' పేరుతో ట్విట్టర్ వేదికగా మాట్లాడారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి ఉన్న జనాభా సుమారు 92 లక్షలు ఉంటే అందులో 45 లక్షలకు పైగా ప్రజలకు మొదటి డోస్ వ్యాక్సిన్ అందిందని, మరో పది లక్షల మందికి పైగా రెండవ డోసు కూడా పూర్తయినదని అన్నారు. ఇప్పటికే మొదటి డోసు తీసుకున్న 45 లక్షల మందికి అందరికి రెండవ డోసు అందించడమే ప్రస్తుతం తమ ప్రథమ ప్రాధాన్యతగా ఉందన్నారు. వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నందున, రాష్ట్రానికి కావలసిన మేరకు వ్యాక్సిన్లు అందడం లేదని కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకి 9 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసే యంత్రాంగం ఉన్నదని, అయితే వ్యాక్సిన్ సరఫరాని అతి పెద్ద సవాలుగా నిలుస్తుందని అన్నారు. వ్యాక్సిన్ తయారీదారులతోను రాష్ట్ర ప్రభుత్వం సమావేశం అవుతుందన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ మరియు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ల తో మాట్లాడుతున్న మన్నారు. జూలై ఆగస్టు తొలి అర్థం నాటికి వ్యాక్సిన్లు సరఫరా తగినంత ఉండే అవకాశం ఉందని అప్పటివరకు వాక్సినేషన్ కార్యక్రమం కొంత సవాల్తో కూడుకున్నది అన్నారు.

రాష్ట్రంలో లాక్డౌన్ సమర్థవంతంగానే కొనసాగుతోందని, ప్రజల అవసరాల నిమిత్తం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. అయితే కొందరు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ప్రజల సౌకర్యార్థం ఈ వెసులుబాటు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు లాక్డౌన్ వల్ల కరోనా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆక్సిజన్ సరఫరా పూర్తిగా కేంద్రం చేతిలో ఉందని, సరఫరా విషయంలో దేశం సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. మరోవైపు రెమిడేసివిర్ మందుల వినియోగంలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తోందని ప్రకటించారు. అయితే దీనిని వాడమని కోవిడ్ రోగులకు కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. ఆక్సిజన్ను, రెమిడెసివిర్ను బ్లాక్ లో అమ్మేవారిని ఇప్పటికే అరెస్ట్ చేశామని కేటీఆర్ ప్రకటించారు.
సొంత వైద్యం పనికిరాదని స్పష్టం చేశారు. కేవలం వైద్యులు, నిపుణులు సూచించిన ప్రామాణిక పద్ధతుల్లోనే వైద్యం తీసుకోవాలని స్పష్టం చేశారు. మానసికంగా బలంగా ఉండాలని, కోవిడ్ రికవరీ తర్వాత ఎలా వుండాలన్నది ముందే ఓ ప్లాన్ వేసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో ఏడు రోజుల పాటు తక్కువ నుంచి అతి తక్కువ డిగ్రీల జ్వరం కొనసాగిందని, దాంతో పాటు ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉండేదని తెలిపారు. ప్రస్తుతం కొంత బలహీనంగా అనిపిస్తోందని, అయినప్పటికీ సాధారణ స్థితికి చేరుకున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications