Dog Attack: వీధి కుక్కల దాడిలో 5 నెలల బాలుడు మృతి..!
వీధి కుక్కల దాడులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఆ తర్వాత వరంగల్ కూడా వీధి కుక్కల దాడుల్లో ఓ బాలుడు మృతి చెందాడు. నిత్యం ఏదో ఓ చోట వీధి కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ షేక్ పేటలో దారుణం చోటుచేసుకుంది.
వీధి కుక్కల దాడిలో ఐదు నెలల బాలుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 17 రోజులుగా మృత్యువుతో పోరాడి బాలుడు సోమవారం తుది శ్వాస విడిచాడు. డిసెంబర్ 8న శరత్ అనే ఐదు నెలల బాలుడిని తల్లిదండ్రులు గుడిసెలో పడుకోబెట్టి పనికి వెళఅలారు. మధ్యాహ్నం వచ్చి చూడగా బాలుడు ఏడుస్తూ కనిపించాడు. దీంతో బాలుడిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పరిస్థితి విషమించడంతో నిలోఫర్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 17 రోజులు మృత్యువుతో పోరాడిన బాలుడు సోమవారం మృతి చెందాడు. బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసినట్లు పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దీంతో స్థానికంగా కలకలం నెలకొంది. వీధి కుక్కలను అదుపు చేయాలని జీహెచ్ఎంసీకి ఎప్పటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు.
అంబర్ పేట ఘటన తర్వాత జీహెచ్ఎంసీ సిబ్బంది కాస్త హాడావిడి చేశారు. ఆ తర్వాత కామన్ అయిపోయింది. నిత్యం వీధి కుక్కలు దాడులు చేస్తుండడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వీధి కుక్కలను కట్టడి చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ లోనే కాదు జిల్లాలో కూడా వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయి.












Click it and Unblock the Notifications