కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం: కువైట్ నుంచి వచ్చిన వ్యక్తిలో లక్షణాలు, హైదరాబాద్కు
హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ కేసులు మనదేశంలోనూ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కేరళ, ఢిల్లీలో మంకీపాక్స్ కేసులు నమోదు కాగా, తాజాగా తెలంగాణలోని కామారెడ్డిలో ఓ అనుమానిత కేసు వెలుగుచూసింది.
కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జులై 6న కామారెడ్డికి వచ్చిన వ్యక్తికి జ్వరం, శరీరంపై దద్దుర్లు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు.
ఆ తర్వాత జులై 20న జ్వరం, 23న దద్దుర్లు రావడంతో మంకీపాక్స్ లక్షణాలుగా అనుమానించిన వైద్యులు.. బాధితుడ్ని హైదరాబాద్లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.
కాగా, శనివారం దేశ రాజధాని ఢిల్లీలోనూ కొత్తగా మంకీపాక్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతకుముందు కేరళ రాష్ట్రంలో మూడు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మంకీపాక్స్ కేసుల సంఖ్య 4కు చేరింది. అయితే, కామారెడ్డి వ్యక్తికి సంబంధించిన నమూనాలను సేకరించి, వాటిని పరిక్షించిన అనంతరం మంకీపాక్స్ సోకిందా? లేదా? అనేది తేలనుంది.
మరోవైపు, మంకీపాక్స్ మహమ్మారి భయంకరమైన రీతిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆరోగ్య అత్యవసర పరిస్థితి(గ్లోబల్ హెల్త్ ఎమర్జీ)ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.