ఎక్కడా బెడ్ దొరక్క నిస్సహాయ స్థితిలో... అసదుద్దీన్ ఓవైసీ చొరవతో ఆస్పత్రిలో చేరిన ఆ పూజారి...
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ బారినపడినవారు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క,సకాలంలో ఆక్సిజన్ అందక విలవిల్లాడిపోతున్నారు. ఎమ్మెల్యేలు,మంత్రులు,వీఐపీలు రికమెండ్ చేసినా సరే ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో కరోనా బారినపడిన ఓ పూజారి(75)కి ఎక్కడా బెడ్ దొరకలేదు. అన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగి చివరకు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ పూజారిని హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదుకున్నారు.
అసదుద్దీన్ ఓవైసీ రికమండేషన్తో శాలిబండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ పూజారికి బెడ్ దొరికింది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక మజ్లిస్ నాయకుల చొరవతో అసదుద్దీన్ ఓవైసీ స్పందించినట్లు తెలుస్తోంది. ఇక ఆస్పత్రిలో బెడ్ దొరకదేమోనని ఆందోళన చెందుతున్న సమయంలో సకాలంలో అసదుద్దీన్ ఓవైసీ స్పందించడం పట్ల పూజారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ విజృంభిస్తూనే ఉన్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడగా... తాజాగా మంత్రి కేటీఆర్ కూడా వైరస్ బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన... ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు.గత కొద్దిరోజులుగా తనను కలిసినవాళ్లు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని,జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గురువారం(ఏప్రిల్ 21) టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని... ఇప్పటికైతే ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. ఇక రెండు రోజుల క్రితం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.