దారుణం: భర్తను హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టిన మహిళ, పెద్ద నాటకమే ఆడింది!
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. ఘటనపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నౌసిన్ బేగం, గగన్ అగర్వాల్(38) భార్యభర్తలు.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా రోడ్డులోని వివేకానందనగర్ కాలనీలో గగన్ నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గగన్.. గత జులైలో పాతబస్తీకి చెందిన నౌసిన్ బేగం(38)ను రెండో వివాహం చేసుకున్నాడు.

కాగా, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి గగన్ కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో తన భర్త కనిపించడం లేదంటూ నౌసిన్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గగన్ సోదరుడు కూడా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్నందున ఎల్బీనగర్ పోలీసులు కేసును అక్కడికి బదలీ చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నౌసిన్ బేగం తన ఇంటికి తాళం వేసి పాతబస్తీలోని పుట్టింటికి వెళ్లిపోయింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు బుధవారం ఉదయం నౌసిన్ను విచారించారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు.
పోలీసుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన నౌసిన్ అసలు నిజం ఒప్పుకుంది. తన భర్తను తానే హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు పోలీసుల ముందు అంగీకరించింది. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు... అక్కడ్నుంచి గగన్ మృతదేహాన్ని వెలికి తీశారు. నౌసిన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications