Rakul Preet Singh: నంబర్ 3: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో..ఈడీ విచారణకు
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెను ప్రకంపనలను సృష్టించిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుు దూకుడు కొనసాగిస్తోన్నారు. తమ విచారణను కొనాగిస్తోన్నారు. ఇప్పటికే ఈ కేసును తెరమీదికి తీసుకొచ్చిన ఈడీ అధికారులు తమ విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన టాలీవుడ్ నటీనటులు, హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్లకు ఇదివరకే సమన్లను జారీ చేశారు. ఇప్పటికీ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మిలను విచారించారు.
రకుల్ ప్రీత్ హాజరు..
ఇక ఈ సారి వంతు రకుల్ ప్రీత్ సింగ్ది. ఇదివరకు టాలీవుడ్లో తీవ్ర దుమారానికి కారణమైన ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొద్దిరోజుల కిందటే తిరగదోడింది. డ్రగ్స్ కేసు ఆరోపణలను ఎదుర్కొంటోన్న వారిలో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మీతో పాటు దగ్గుబాటి రానా, తరుణ్, ముమ్మైత్ ఖాన్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ వంటి నటీనటుల పేర్లు ఉన్నాయి. ఈడీ అధికారుల నుంచి నోటీసులను అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్..విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆమె ఈడీ కార్యాలయానికి వచ్చారు.
సాయంత్రం దాకా విచారణ..
రకుల్ ప్రీత్ సింగ్ వెంట ఒకరిద్దరు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఈ రోజంతా ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలకమైన లీడ్స్ దొరకడంతో అధికారులు విచారణను పునఃప్రారంభించారు. పూరీ జగన్నాథ్తో ఆరంభమైన ఈ విచారణల పర్వం.. ఇక- సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు లేకపోలేదు. డ్రగ్స్ కేసు మూలాల నుంచీ ఆరా తీస్తారని తెలుస్తోంది. ఇప్పటిదాకా వెలుగులోకి రాని కొన్ని పేర్లు కూడా బయటికి వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పూరీ, ఛార్మీల విచారణ
ఈ కేసుతో ప్రమేయం ఉన్న టాలీవుడ్ ప్రముఖులందరినీ వరుసబెట్టి విచారణకు పిలవనున్నారు. ఇది ముగింపుదశకు వచ్చే సరికి కొన్ని అరెస్టులు కూడా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. కిందటి నెల 31వ తేదీన పూరీ జగన్నాథ్ను ఈడీ అధికారులు విచారించారు. చాలాకాలంగా ఆయనతో అసోసియేట్ అయి ఉన్న నటి ఛార్మీని గురువారం నాడు ఎంక్వైరీ చేశారు. సుమారు 10 గంటల పాటు వారి విచారణ కొనసాగింది. టాలీవుడ్లో డ్రగ్ లింకులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది.
డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇన్ఫర్మేషన్..
ప్రత్యేకించి డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్గా మారిన తరువాత లభించిన పక్కా సమాచారంతో ఈ విచారణను సాగించారు..ఛార్మిని ప్రశ్నించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపైనా వారు దృష్టి సారించారు. ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఛార్మి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లను అందజేశానని, వారి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈడీ విచారణకు తాను సహరించాననీ, ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని అన్నారు.
Recommended Video
బాలీవుడ, శాండల్ వుడ్లోనూ
అటు బాలీవుడ్లోనూ ఇదే తరహా డ్రగ్స్ కేసులో విచారణలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. నటుడు అర్మాన్ కోహ్లీని నార్కొటిక్స్ బ్యురో అధికారులు ఇదివరకే అరెస్ట్ చేశారు. ఆయనను రిమాండ్కు తరలించారు. స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఉదంతంతో బాలీవుడ్లో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అర్జున్ రామ్పాల్, సారా అలీఖాన్, రియా చక్రవర్తి, దీపికా పడుకొణె వంటి టాప్ సెలెబ్రిటీలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు విచారించారు. ఇదే తరహాలో కన్నడనాట శాండిల్వుడ్లోనూ డ్రగ్స్ కేసు విచారణలు కొనసాగాయి. అరెస్టులు కూడా నమోదయ్యాయి.