‘దిశ నిందితుల’ కోసం ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల టీమ్.. రేపే రీపోస్టుమార్టం.. డెడ్ బాడీల అప్పగింత..
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రియ చేపట్టాలని కోర్టు షరతు విధించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ రిక్వెస్ట్ మేరకు.. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. నలుగురు నిపుణులతో కూడిన టీమ్ ను హైదరాబాద్ పంపేందుకు అంగీకరించింది.
రేపు ఉదయం 9 గంటలకు ప్రక్రియ..
ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆధ్వర్యంలోని టీమ్.. ఆదివారం సాయంత్రానికే హైదరాబాద్ చేరుకోనుంది. డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్, డాక్టర్ వరుణ చంద్ర టీమ్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా సోమవారం ఉదయం 9 గంటలకు గాంధీ ఆస్పత్రి మార్చురీలో రీపోస్టుమార్టం ప్రారంభిస్తారు. ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీసి, కలెక్షన్స్ ఆఫ్ ఎవిడెన్స్ను సీల్డ్ కవర్లో భద్రపరుస్తారు.
సోమవారమే నలుగురి అత్యక్రియలు!
రీపోస్టుమార్టం పూర్తయిన వెంటనే నలుగురు నిందితుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని హైకోర్టు చెప్పింది. సోమవారం ఉదయమే రీపోస్టుమార్టం ప్రక్రియ మొదలుకానుంది. సాయంత్రంలోగా బాడీలను బంధువులకు అప్పగించడంతోపాటు సోమవారమే అంత్యక్రియలు జరిపించేలా ఆయా కుటుంబాలను పోలీసులు ఒప్పించినట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయిన మృతదేహాలు
దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయాయని, వాటిని మైనస్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రీజర్లో ఉంచామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారంనాటి రీపోస్టుమార్టం ఎయిమ్స్ డాక్టర్లకు సవాలు లాంటిదనే చెప్పాలి. ఈనెల 6న షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద దిశ నిందితులు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఎన్ కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ మహిళా సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో అత్యక్రియల ప్రక్రియ వాయిదాపడుతూ వచ్చింది.