ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేశారంటూ బంజారాహిల్స్ పోలీసులు రామచంద్ర భారతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయన కేసు నమోదైంది. అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 8తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఆయనను రిమాండ్ కు తరలించారు.

తాజాగా, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనూ రామచంద్రభారతిపై కేసు నమోదైంది. రామచంద్రభారతి.. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్లు మూడేసి చొప్పున నకిలీవి తయారు చేసి తన వద్ద పెట్టుకున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా రెండు రోజుల క్రితమే పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ వివరాలు వెల్లడించలేదు. ఇందుకుసంబంధించిన పలు కీలక ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారు. కాగా, ఈ కేసులో నేరం రుజువైతే రామచంద్రభారతికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ కూడా ఇటీల నిర్వహించిన మీడియా సమావేశంలో రామచంద్రభారతి పలు మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈ కేసు నమోదు కావడం గమనార్హం.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో రామచంద్రభారతితోపాటు నంద కుమార్, సింహయాజీలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications