మరో పరువు హత్య.. మాటు వేసి వేసేశారు.. 20 సార్లు కత్తితో పొడిచి
సరూర్ నగర్ పరువు హత్య కలకలం రేపింది. నాగరాజును నడిరోడ్డుపై పొడిచి చంపేసిన ఘటన ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. హైదరాబాద్లో మరో ఘటన జరిగింది. బేగంబజార్లో యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. మచ్చి మార్కెట్ వద్ద నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో దాడి చేశారు. నడిరోడ్డుపై కత్తితో సుమారు 20 సార్లు పొడిచి చంపేశారు. మృతుడిని నీరజ్ పన్వార్గా గుర్తించారు. ఏడాది కింద అతడు అఫ్జల్గంజ్కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.
వారికి 3 నెలల వయసు ఉన్న బాలుడు ఉన్నట్లు సమాచారం. యువతి బంధువులే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కులాంతర వివాహమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. షాహీ నాథ్ గంజ్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. నీరజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలం నుంచి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు వాటి ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నీరజ్ వస్తున్న దారిలో ఐదుగురు దుండగులు మాటు వేసి హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నీరజ్ హత్య విషయం తెలిసి కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.
వాస్తవానికి నీరజ్ పన్వార్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారు. ఇవాళ కూడా అలర్ట్గానే ఉన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాలుగైదు మంది కాపు కాసి మరీ వేసేశారు. అతని భార్యకు తీరని శోకాన్ని మిగిల్చారు. నీరజ్ మృతితో ఆ ప్రాంతం విషాద వదనంతో నిండిపోయింది.