మరో ఆర్టీసీ కార్మికుడు మృతి .. శవంతో బైటాయించిన కార్మికులు .. పరిగి డిపోలో ఉద్రిక్తత
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇప్పుడు డోలాయమాన స్థితికి చేరుకుంది. ఆర్టీసీ సమ్మె విరమిస్తామని బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటనతో ఆర్టీసీ యూనియన్లలో విబేధాలు బయటపడ్డాయి. ఇక తాజాగా మరోమారు యూ టర్న్ తీసుకున్న ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
డోలాయమాన స్థితిలో ఆర్టీసీ కార్మిక లోకం ... తిరిగి విధుల్లో చేర్చుకుంటారా ? లేదా ?
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండానే సమ్మె విరమణ ఆలోచన ఆర్టీసీ కార్మికులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుంది. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపో డ్రైవర్ వీర భద్రయ్య ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని, ఉద్యోగాలు ఉన్నాయో లేదో తెలీలేదని తీవ్ర మనోవేదనకు గురై మరణించాడు. దీంతో ఆర్టీసీ కార్మికులు పరిగి డిపోలోకి శవంతో పాటు చొచ్చుకువెళ్ళారు. అక్కడే శవాన్ని ఉంచి ఆందోళన కొనసాగిస్తున్నారు.
తీవ్ర ఆగ్రహావేశాలతో కార్మికులు ఊగిపోతున్నారు. ఇంతమంది కార్మికులు మరణిస్తున్నా చలనం లేని సీఎం తీరుకు నిరసనగా నినాదాలు చేస్తున్నారు. దీంతో వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపోలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళన కారులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వ తీరు మారకపోవటం, మరోపక్క ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో ఆర్ధిక ఇబ్బందులు, ఇంకొక వైపు ఆర్టీసీ కార్మికుల మరణాలు ఆర్టీసీ కార్మిక లోకాన్ని బాగా టెన్షన్ పెడుతున్నాయి.