వద్దంటే వాన.. రెండురోజులు అట, వాతావరణ శాఖ
ఇటీవల కురిసిన వర్షంతో ఉక్కిరి బిక్కిరికి గురయ్యాం. హమ్మయ్యా.. కాస్త ఎండ వచ్చిందని అనుకునేలోపు మరో పిడుగులాంటి వార్త. అవును మళ్లీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నల్గొండ వరకు నైరుతు పవనాలు ఉపసంహరించుకుంటుండగా.. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. మళ్లీ వాన అని అనడంతో రైతు గుండెల్లో దడ మొదలవుతోంది.
ఉపరితరల ఆవర్తనం..
శనివారం ఏర్పడిన అల్పపీడనం ఆదివారానికి ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. దాని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకి పోయే కొలదీ నైరుతి దిశ వైపుగా వంపు తిరిగి కొనసాగుతోంది. తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి మర్థబన్ గల్ఫ్ నుండి తూర్పు-మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం అనుబంధ ఉపరితల ఆవర్తనం వరకు 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
రెండురోజులు
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో, సోమ, మంగళ వారాల్లో ఒకటీ లేదా రెండు చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం వల్ల పంటలకు నష్టం జరిగే ఛాన్స్ ఉంది.
నష్టమే
రాష్ట్రంలో ఈ సారి సమృద్దిగా వర్షాలు కురిశాయి. పంటకు సరిపోవడంతోపాటు.. ప్రాజెక్టులు నిండాయి. అయితే సీజన్ పూర్తయి.. పంట చేతికొచ్చే సమయంలో కూడా వర్షం పడుతుంది. ఇటీవల కురిసిన వర్షంతో తెలంగాణ రాష్ట్రంలో మక్క పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న ఎండిన తర్వాత.. మళ్లీ ఆరబెట్టి.. విక్రయించడం రైతులకు కష్టంగా మారింది. ఇటు వరి పంట కూడా దాదాపుగా చేతికి వచ్చింది. మొక్కల కింద తడి ఉంటే కోయడం కష్టంగా మారనుంది. ఇప్పటికైనా తడి మారితే పంట కోయడం, విక్రయించడం వీలవుతుంది.