తెలంగాణలో తొలిసారి: ‘అసాంఘిక కార్యకలాపాలు’తో ట్విట్టర్, వాట్సాప్, టిక్టాక్లపై కేసు నమోదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, వాట్సాప్, టిక్టాక్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా అసాంఘిక శక్తులు రెండు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రదర్శనలు, వ్యాఖ్యలను వీడియోలు, చిత్రాలను సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తున్నారంటూ పాత్రికేయుడు సిల్వేరి శ్రీశైలం నాంపల్లి కోర్టులో ఇటీవల ఫిర్యాదు చేశారు.

రెచ్చగొట్టే పోస్టులంటూ ఫిర్యాదు..
ఈ నేపథ్యంలో సదరు సోషల్ మీడియాలపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసేందుకు గత డిసెంబరులో పార్లమెంటులో చట్టం కేంద్రం చట్టం చేసిందని, అప్పటి నుంచే సంఘ విద్రోహ శక్తులు అమాయకులను రెచ్చగొట్టేలా యువతీయువకుల ద్వారా సోషల్ మీడియాల్లో పోస్టు చేయిస్తున్నారని శ్రీశైలం తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పాకిస్థాన్లో జరిగితే..
సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్న పాకిస్థానీయుల నిరసనలు భారత్లో చేసినట్లు వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నారని తెలిపారు. వాట్సాప్ అధిపతి అభిజిత్ బోస్, ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వర్, టిక్టాక్ అధిపతి నిఖిల్ గాంధీలను తన ఫిర్యాదులో ప్రతివాదులుగా చేర్చారు. కాగా, శ్రీశైలం ‘నోటా టీవీ' అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నట్లు తెలిసింది.

తొలిసారి సోషల్ మీడియాలపై కేసులు..
కాగా, కోర్టు ఆదేశాల మేరకు ఐపీసీ 153ఏ, 121ఏ, 124, 124ఏ, 294, 295ఏ, 505,120బీ ఐటీ చట్టం 66 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ట్విట్టర్, వాట్సప్, టిక్టాక్ ప్రతినిధులకు నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు మాత్రమే జారీ చేయగా, తాజాగా, కోర్టు ఆదేశాలతో సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, వాట్సాప్, టిక్టాక్లపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో సోషల్ మీడియాలపై కేసులు నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications