పోచారానికే ఆ కుర్చీ... స్పీకర్ ఎన్నిక లాంఛనమే..!
తెలంగాణ అసెంబ్లీ ఎట్టకేలకు కొలువుదీరింది. ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులు దాటినా వివిధ కారణాలతో అసెంబ్లీ నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వాయిదాపడుతూ వచ్చింది. అలాగే స్పీకర్ ఎన్నికపై కూడా ట్విస్టుల మీద ట్విస్టులు నడిచాయి. ఆ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలనే దానిపై టీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలు పడింది. చివరకు సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డికి పట్టం కట్టనున్నారు.
సీనియర్ కే ఆ కుర్చీ
రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ విస్తరణతో పాటు స్పీకర్ ఎంపికపై టీఆర్ఎస్ అధిష్టానంకు తలనొప్పులు తప్పలేదు. మంత్రులుగా ఎవరిని తీసుకుంటారనే దానిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అలాగే స్పీకర్ విషయంలో కూడా తర్జనభర్జన జరిగింది. కొందరు సీనియర్లను ఆ కుర్చీలో కూర్చోబెట్టాలని గులాబీ బాస్ భావించినప్పటికీ.. వారు ససేమిరా అన్నారట. దీంతో కిస్సా కుర్సీ కా అనే రీతిలో డైలామా నడిచింది. చివరకు పోచారం శ్రీనివాసరెడ్డికి ఆమోద ముద్ర వేశారు.
కొలువుదీరనున్న అసెంబ్లీ... అమరవీరులకు కేసీఆర్ నివాళి
ఓటమి భయం.. అందుకే ఆ కుర్చీ వద్దంట
స్పీకర్ గా పనిచేసినవారు వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతారనే భయం నాయకులను వెంటాడుతోంది. ఇదివరకు స్పీకర్ గా వ్యవహరించినవారు మళ్లీ గెలిచిన దాఖలాలు లేవు. ఇదే అంశాన్ని తీవ్రంగా పరిగణించిన టీఆర్ఎస్ నేతలు.. ఆ కుర్చీ వద్దంటే వద్దన్నారట. తొలుత కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నవారి పేర్లు పరిశీలించినా.. వారు కాదనడంతో స్పీకర్ ఎంపిక భారంలా మారింది. అయితే బాన్సువాడ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ ఒప్పించారనే టాక్ వినిపిస్తోంది.
ఏకగ్రీవమే..! స్పీకర్ గా పోచారం
అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు కేసీఆర్ తో సమావేశమయ్యారు పోచారం శ్రీనివాసరెడ్డి. స్పీకర్ నామినేషన్ పై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తరువాత స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అనంతరం పోచారం నామినేషన్ దాఖలు చేస్తారు. శుక్రవారం నాడు స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ మద్దతివ్వడంతో స్పీకర్ ఎన్నిక లాంఛనం కానుంది. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.