బండి భావొద్వేగం, బీఎల్ నోటీసులపై కంటతడి.. ఊరుకోం అంటూ
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు కొనసాగుతూనే ఉంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి, సంఘ్ ప్రచారక్ అయిన బీఎల్ సంతోష్కు టీఆర్ఎస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై కన్నీళ్లు పెట్టుకున్నారు. సంఘ్ ప్రచారక్లను కేసీఆర్ అవమానానికి గురిచేస్తోందని ఆరోపించారు.
ఎంపీ, ఎమ్మెల్యే కావాలని బీఎల్ సంతోష్ అనుకోలేదని, ఆస్తులు కూడబెట్టలేదని, విదేశాల్లో వ్యాపారం చేయలేదని చెప్పారు. ఢిల్లీ మద్యం స్కామ్ నుంచి బయట పడేందుకే సంతోష్ను అవమానిస్తున్నారని బండి సంజయ్ వాపోయారు. బీఎల్ సంతోష్ జోలికి వస్తే ఊరుకోబోమని, సహించబోమని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ దుర్మార్గాలను గ్రహించిన కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేస్తోన్న విషయాన్ని గుర్తుచేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను చిప్ప చేతికిచ్చి అడుక్కునే స్థాయికి కేసీఆర్ దిగజార్చారని బండి సంజయ్ విమర్శించారు.
ఏటా రూ.30 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారని, కేసీఆర్కు మళ్లీ అవకాశం ఇస్తే అదీ మరో 5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని తెలిపారు. కేసీఆర్ పాలన బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు సిద్ధం అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులతోపాటు అన్నీ పార్టీలు టీఆర్ఎస్తో కలిసి పని చేసేందుకు సిద్ధం అవుతున్నాయపి కేసీఆర్ సంకేతాలు ఇస్తన్నారని బండి సంజయ్ ఆరోపించారు.