50 మంది ఎమ్మెల్యేలు రెడీ: టీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరతారు, బండి సంజయ్..?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారో లేదో.. బీజేపీకి మంచి బూస్టింగ్ వచ్చింది. ఉప ఎన్నిక రానుండటం.. తమ పార్టీ గెలుస్తోందనే విశ్వాసంతో కమల శ్రేణులు ధీమాతో ఉన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఒక అడుగు ముందుకేశారు. రాష్ట్రంలో ఇక టీఆర్ఎస్ పార్టీ పనయిపోయిందని అంటున్నారు. బీజేపీ అధికారం చేపట్టడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బద్దలు కొడతాం..
టీఆర్ఎస్ గడీ బద్దలు కొట్టేందుకు బీజేపీ భారీ ప్రణాళికలతో ఉంది. మోడీ, అమిత్ షా టీమ్.. దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారం లక్ష్యంగా పావులు కదుపుతుంది. మోడీ సర్కారుకు టీఆర్ఎస్ వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ ఉనికిని నామమాత్రం చేశారు. ఇది తెలంగాణలో బీజేపీ విస్తరణకు అవకాశం ఇచ్చినట్టు అయింది. ఆపరేషన్ తెలంగాణ పేరుతో బీజేపీ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీలో చేరి హుజూరాబాద్లో గెలిచిన ఈటల రాజేందర్ నేతృత్వంలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా కమిటీ నడుస్తోంది.

కమిటీ వర్క్
కమిటీ తెర వెనుక చురుకుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, మునుగోడు శాసనసభ స్థానానికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. మరో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత దాసోజు శ్రవణ్ కూడా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు.

50 మంది ఎమ్మెల్యేలు
50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలు.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు తథ్యమన్నారు. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని చెప్పారు. తమ పార్టీలోకి మరిన్ని వలసలు ఉన్నాయని ఇదివరకే చెప్పారు. 21వ తేదీన భారీగా చేరికలు ఉంటాయని వివరించారు. ఈ క్రమంలో 50 మంది నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారనే హింట్ ఇచ్చారు. ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications