ఇంటింటికీ 10 లక్షలు.. చింతమడక స్కీమ్.. భట్టి డిమాండ్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తన సొంతూరు చింతమడకకు ఏ ముహుర్తాన వరాల జల్లు కురిపించారో గానీ విపక్ష నేతలకు మాత్రం ఫుల్లుగా పని దొరికినట్లైంది. చింతమడకలో ఇంటింటికీ 10 లక్షలు ఇస్తామన్న కేసీఆర్ ప్రకటనను తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. ఆ క్రమంలో కేసీఆర్పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో తమరు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికి సమన్యాయం చేస్తామని ప్రమాణం చేసి ఇప్పుడేమో మీ సొంతూరుకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తారా అంటూ ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడిన భట్టి పలు అంశాలను ప్రస్తావించారు.

చింతమడకలో ఇంటింటికీ 10 లక్షలు ఏవిధంగా ఇస్తానని ప్రకటించారో.. అదేవిధంగా రాష్ట్రమంతటా అన్ని కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు సీఎంకు లేఖ రాస్తామని.. ఒకవేళ ఆయన స్పందించకుంటే అర్హులైన కుటుంబాలను కూడగట్టే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడకపోతే వారిలో అసంతృప్తి పెరిగి అశాంతికి దారి తీసే ఛాన్సుందని హెచ్చరించారు.
రాష్ట్రమంతటా ప్రతి కుటుంబానికి 10 లక్షలు రూపాయలు తీసుకోవాలని.. ఆ స్కీమ్కు చింతమడక పథకం అని పేరు పెట్టుకున్నా తమకేమీ అభ్యంతరం లేదన్నట్లుగా ఎద్దేవా చేశారు. ఆయన చింతమడక గ్రామానికి సీఎం కాదని.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం మరిచిపోవద్దని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications