ధాన్యం కొనాల్సిన వాళ్లే ధర్నా చేస్తున్నారు.. భట్టి విక్రమార్క ఫైర్
ధాన్యం కొనుగోలుపై రచ్చ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ధాన్యం కొనుగోలుపై పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నాయి. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్రానికి ధాన్యం కొనుగోలు చేతకాక కల్లబొల్లి కబుర్లు చెబుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీన్లోకి వచ్చారు. వరి ధాన్యం కొనాల్సిన వాళ్లే రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో పాలించే బీజేపీ, రాష్ట్రాన్ని పాలించే టీఆర్ఎస్ రెండు పార్టీలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నాయని విమర్శించారు. మరి కొనాల్సింది అమెరికానా? పాకిస్తానా? ధాన్యం కొనాల్సిన మీరే ఎందుకు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం మీకు చేతన కావడం లేదా? అధికారంలో ఉండి ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వీళ్ల పాలనతో రాష్ట్రాన్ని దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశారని భట్టి ఏకిపారేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ధర్నాలతో రైతులను గందరగోళంలో పడేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ధర్నాలతో పాలన చేతకాదని, రైతులను కాపాడలేమని చెబుతున్నారని అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అందులోభాగంగా ధర్నాలతో డ్రామాలు చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.
యాసంగి వరి పంట కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం అనడంతో దుమారం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చింది. యాసంగి వరి పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. మండల కేంద్రం/ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ శ్రేణులు.. రైతులు ఆందోళనకు దిగారు.
వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనుగోలు చేయని కేంద్రం తీరుపై ఇక నుంచి పోరాటం చేస్తామని కేసీఆర్ చేసిన ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. యాసంగిలో తెలంగాణ రైతులు పండించే ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.