హైదరాబాద్ మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్: భూమిలో పాతిపెట్టినా..
హైదరాబాద్: నగరంలో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. హైదరాబాద్ నగర శివారు జిన్నారంలోని ఓ ఫార్మా కంపెనీ ఆవరణలో భారీగా మాదక ద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత ఐదు రోజులుగా డీఆర్ఐ అధికారులు ఆ కంపెనీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు.
సోదాలు చేసినా దొరక్కుండా ఉండేందుకు డ్రగ్స్ను భూమిలో పాతిపెట్టినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్నవారి నుంచి సేకరించిన సమాచారంతో మంగళవారం రాత్రి పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని తవ్వి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను వెలికితీశారు.
వెలికితీసిన మాదకద్రవ్యాల్లో ఎపిడ్రిన్ 45 కిలోలు, మెఫెడ్రోన్ 7.5 కిలోలు ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ. 6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. డ్రగ్స్ ముఠా కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఆర్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ తెలిపారు.
డ్రగ్స్ను భూమీలో పాతి పెట్టడం గమనార్హం. డీఆర్ఐ అధికారులు పక్కా సమాచారంతో డ్రగ్స్ను బయటకు తీశారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు రూ.6 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇటీవలే 80 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిన డీఆర్ఐ అధికారులు
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ ఎత్తున డగ్ర్స్ పట్టుబడటం కలకలం రేపింది. నగర శివారులో సుమారు రూ. 80 కోట్లకుపైగా విలువ చేసే డ్రగ్స్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నారు.
రూ. 28.52 కోట్ల విలువైన 142.6 కిలోల మెఫెడ్రన్, రూ. 3.1 కోట్ల విలువైన 31 కిలోల ఎపిడ్రిన్ను సీజ్ చేశారు. ఓ ఫ్యాక్టరీలో మెఫెడ్రిన్ తయారీకి సిద్ధంగా ఉంచిన 250 కిలోల ముడిసరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ ముడిసరుకు విలువ రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ తోపాటు ముంబైలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ. 45 లక్షల విలువైన భారత కరెన్సీ, యూఎస్ డాలర్లు, ఈయూఆర్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.