ఓహో బీజేపీ స్ట్రాటజీ అదా.. మరి గులాబీ నేతలు ఏంగావాలే..!
హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీ జోరు కొనసాగుతోందా? టీఆర్ఎస్కు అల్టర్నేట్ పార్టీగా తయారవుతోందా? లోక్సభ ఎన్నికల పాజిటివ్ ఫలితాలతో క్యాడర్లో జోష్ నింపనుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మున్సిపల్ పోరులో టీఆర్ఎస్ పార్టీతో తాడోపేడో తేల్చుకునే విధంగా కమలనాథులు సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణలో సభ్యత్వ నమోదు పండుగ నడుస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో మెంబర్ షిప్ క్యాంపెయిన్ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీగా సాగుతున్న సభ్యత్వ నమోదు పర్వం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఆ క్రమంలో దూకుడుమీదున్న కారు గుర్తుకు కమలం పువ్వు బ్రేక్ వేస్తుందా లేదా అనేది ఓటర్లు తేల్చాల్సిందే.

లోక్సభ ఎన్నికల ఫలితాలతో కమలం జోష్
రాష్ట్ర ఏర్పాటు దరిమిలా టీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప మరో పార్టీ లేదేమో అన్నవిధంగా వాతావరణం క్రియేట్ చేసింది. ఆ క్రమంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 88 స్థానాల్లో గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చింది. అంతో ఇంతో టీఆర్ఎస్కు అపొజిషన్గా కనిపించిన కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. ఇక బీజేపీ ఐదు స్థానాల నుంచి ఒక్క స్థానానికి పడిపోయింది. గోషామహల్ నుంచి ఒకే ఒక్క కమలనాథుడిగా రాజాసింగ్ గెలుపొందారు. బీజేపీ అగ్రనేతలుగా ముద్రపడ్డ కిషన్ రెడ్డి, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఓటమి పాలయ్యారు.
అదలావుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడ్డ బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి పుంజుకున్నట్లైంది. నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలు కమలం బుట్టలో పడటం చర్చానీయాంశమైంది. సారు, కారు, పదహారు అంటూ టోటల్ ఎంపీ స్థానాలపై కన్నేసిన టీఆర్ఎస్ నేతల పాచికలు పారలేదు. కేవలం 9 స్థానాలు మాత్రమే గులాబీ ఖాతాలో పడ్డాయి.

మున్సిపల్ పోరులో సై..! కారుతో పువ్వు ఢీ
లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపినట్లైంది. అటు ఢిల్లీ పెద్దలు సైతం ఊహించలేని ఫలితాలు రావడం కమలనాథులకు కొత్త ఉత్సాహం తెచ్చినట్లైంది. దాంతో తమ పార్టీకి బలం పెరిగిందని భావిస్తున్న హైకమాండ్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదిగి అధికారం చేపట్టే దిశగా పావులు కదుపుతున్నారనే వాదనలు లేకపోలేదు.
ఆ క్రమంలో మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నారు కమలనాథులు. పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నారు. దాంతో సభ్యత్వ నమోదుపై ప్రధానంగా దృష్టి సారించారు. పల్లె నుంచి పట్నం దాకా మెంబర్ షిప్ ప్రక్రియ స్పీడప్ చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మున్సిపాలిటీలను దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఆ క్రమంలో ఆయా వార్డుల్లో బలమైన లీడర్లను గుర్తిస్తూ కాషాయం కండువా కప్పేందుకు రెడీ అవుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని కమలనాథుల ఆశ..!
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందనేది బీజేపీ నేతల ఆలోచన. ఆ మేరకు దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీల అభివృద్ధి జరగలేదని, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ పాలక మండళ్లు విఫలమయ్యాయనే విషయం జనాల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
అంతేకాదు యువ ఓటర్లను టార్గెట్ చేస్తూ ప్రచార కార్యక్రమాలు రూపొందించే పనిలో పడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డుల్లో పాగా వేయడమే కాకుండా మెజార్టీ ఛైర్మన్ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న పువ్వు.. కారు జోరుకు ఎలా బ్రేకులు వేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications