మా నౌకరీలు మాక్కావాలి: బీజేపీ నిరుద్యోగ మహాధర్నా, బండి సంజయ్ నయా వ్యూహం!!
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని అస్త్రంగా వాడుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు అశనిపాతంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంతో నిరుద్యోగులలో ప్రభుత్వంపై వ్యతిరేకతను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 25వ తేదీన నిరుద్యోగ మహాధర్నా చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బండి సంజయ్ భావిస్తున్నారు.
మా నౌకరీలు మాక్కావాలి అన్న నినాదంతో ఆందోళనకు శ్రీకారం చుడుతున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కి కారణమైన కేటీఆర్ ను క్యాబినెట్ నుండి భర్తరఫ్ చేయాలని, టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన నిరుద్యోగులకు ఒక లక్ష రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని, అంతేకాదు పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ ప్రధాన డిమాండ్లతో బీజేపీ మహా ధర్నా నిర్వహించనుంది. మార్చి 25వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించి, నిరుద్యోగులతో కలిసి బిజెపి నేతలు దీక్ష చేయనున్నారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరుద్యోగులతో ఈ దీక్షను నిర్వహించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. మరి బీజేపీ మహాధర్నా నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది. నిరుద్యోగ మహా ధర్నా కొనసాగుతుందా? లేదా ప్రభుత్వం దీనిని అడ్డుకునేందుకు ఏదైనా ప్రయత్నం చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నికలు ఏడాది ఇబ్బంది పెట్టడానికి బిజెపికి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం ఒక ఆయుధంగా మారింది. దీంతో యువతను తమ వైపుకు తిప్పుకునేందుకు బిజెపి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉద్యోగాల భర్తీ జరుగుతుందని భావించిన నిరుద్యోగ యువత ఎంతో కష్టపడి రాసిన పరీక్షలను టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంతో రద్దు చేయడంతో అసహనంతో ఉన్న వేళ, బిజెపి యువతను ప్రభుత్వంపై తిరుగుబాటుకు వాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో బిజెపి ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications