మొహర్రం ఊరేగింపుపై బీజేపీ భగ్గు: 8వ నిజాంగా కేసీఆర్: గణేష్ ఉత్సవాలకు ఇంకో రూల్: రాజాసింగ్
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ పాతబస్తీలో బీబీ కా ఆలం మొహర్రం ఊరేగింపును నిర్వహించడంపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. బీబీ కా ఆలం ఊరేగింపునకు ఎలా అంగీకరించిందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిజాం వారసుడిగా వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని..
తెలంగాణ ఎనిమిదో నిజాంగా ఆవిర్భవించారని విమర్శిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఎక్కడే గానీ మొహర్రం ఊరేగింపులను నిర్వహించకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిందని బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతర్ చేసిందని, కోర్టు ధిక్కారానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. బీబీ కా ఆలం ఊరేగింపునకు సంబంధించిన ఓ వీడియోను ఆయన తన ట్వీట్కు జత చేశారు.
కోవిడ్ పరిస్థితుల్లో అనుమతులు ఎలా..
మొహర్రం ఊరేగింపును నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతులను ఇచ్చిందని రాజాసింగ్ నిలదీశారు. గణేష్ ఉత్సవాలకు ఒక రూల్, మొహర్రం ఊరేగింపునకు ఒక రూలా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ఎనిమిదో నిజాంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందువులను ద్వితీయ పౌరులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఒక వర్గానికి చెందిన వారిని సంతృప్తి పరిచే రాజకీయాలకు కేసీఆర్ పాల్పడుతున్నారని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ వ్యవహారాన్ని చూస్తోంటే.. తాము భారత్లోనే ఉన్నామా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయని అన్నారు.

తెలంగాణ భాగం కాదా?
అఖండ భారతావనిలో తెలంగాణ ఓ భాగం కాదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయని చెప్పారు. సంతృప్తికర రాజకీయాల కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడం తెలంగాణ ప్రభుత్వ పనితీరును స్పష్టం చేస్తోందని విమర్శించారు. హిందువులను ఎందుకు ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తోన్నారని నిలదీశారు. వేలాది కేసులు పుట్టుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మొహర్రం ఊరేగింపును ఏ ఉద్దేశంతో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం ఊరేగింపు ఆదివారం పాతబస్తీలో నిర్వహించారు.
Recommended Video

రాజకీయంగా
యాకుత్పురా, చార్మినార్ గుల్జార్హౌస్, మీరాలంమండి, దారుల్ షిఫా మీదుగా చాదర్ ఘాట్ వరకు సంప్రదాయబద్ధంగా చేపట్టారు. ఈ ఊరేగింపునకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఏనుగుపై కాకుండా డీసీఎం వాహనంపై బీబీ కా ఆలం ఊరేగింపును నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా కరోనా నిబంధనలను పాటించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేసీఆర్ సర్కార్ను ఇరుకున పెట్టేలా బీజేపీ ఉద్యమాలను చేపట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం అదే సమయంలో బీబీ కా ఆలం ఊరేగింపును యధాతథంగా చేపట్టడంపై తెలంగాణ బీజేపీ నాయకులు రాజకీయంగా పోరాడాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications