డప్పు చప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు.. తొలిబోనం అందుకున్న జగదాంబిక అమ్మవారు..
లంగర్హౌస్ : డప్పు చప్పుళ్లు, శివసత్తుల శివాలు.. పోతరాజుల విన్యాసాల మధ్య గోల్కొండ అమ్మవారు తొలిబోనం అందుకుంది. ఆషాడమాసంలో ఏటా తెలంగాణలో నిర్వహించే బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రత్యేక అలంకరణ, పూజల అనంతరం అమ్మవారు తొలి బోనం అందుకున్నారు.
ఊరేగింపుగా గోల్కొండకు
లంగర్హౌస్లో ఊరేగింపుతో గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయి. చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద నుంచి తెలంగాణ మంత్రులు బోనాలతో బయలుదేరారు. దేవాదాయ శాఖ తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం పోతురాజుల విన్యాసాలు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికి శాఖ ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శనతో తొట్టెల ఊరేగింపు ప్రారంభమైంది.
ఒడి బియ్యం పోసుకుని
గోల్కొండ చోటా బజార్ వద్ద అనంతచారి ఇంట్లో ఆభరణాల అలంకరణ పూర్తి చేసిన అనంతరం దిగంబర్ పతులు ఇంట్లో ఉత్సవ విగ్రహానికి ఒడి బియ్యం పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి తొట్టెల సమర్పించారు.
భద్రత కట్టుదిట్టం
రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు గురు, ఆదివారాల్లో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిరోజు పూజ కోసం లంగర్హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు ఐదు ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు, అదనపు బలగాలు, బాంబ్ స్క్వాడ్, యాంటీ సెబిటేజ్ బృందం, మహిళా, ట్రాఫిక్ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
గోల్కొండ కోటలోకి ఉచిత ప్రవేశం
బోనాల నేపథ్యంలో సందర్శకులు, భక్తులకు గోల్కొండ కోటలోకి ఉచిత ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 4 నుంచి ఆగస్టు 1వరకు ప్రతి గురు, ఆదివారాల్లో గోల్కొండ కోటకు వచ్చే వారిని టికెట్ లేకుండా కోటలోకి అనుమతించనున్నట్లు అధికారులు ప్రకటించారు.