బీజేపీలో చేరిక ఖరారు: జేపీ నడ్డాను కలిసిన బూర నర్సయ్య గౌడ్
న్యూఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను బూర నర్సయ్య గౌడ్ కలిశారు. నడ్డాకు శాలువా కప్పి సత్కరించారు. దీంతో ఆయన బీజేపీలో చేరిక ఖాయమైనట్లు తెలుస్తోంది.
అంతేగాక, అక్టోబర్ 19న బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నట్లు తెలిసింది. సోమవారం బూర నర్సయ్య ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నట్లు సమాచారం.
జేపీ నడ్డాతోపాటు పలువురు బీజేపీ పెద్దలను కూడా ఆయన కలిసినట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఆ పార్టీకి బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బూర నర్సయ్య గౌడ్ రెండ్రోజులు ఢిల్లీలో పడిగాపులు కాసినా.. బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని మంత్రి జగదీశ్ రెడ్డి ట్వీట్ చేసిన నేపథ్యంలో జేపీ నడ్డాతో బూర నర్సయ్య గౌడ్ ఫొటో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా.. దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నర్సయ్య గౌడ్.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారంటూ ప్రచారం జరిగింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సూచనతోనే బూర నర్సయ్య ఢిల్లీకి వెళ్లారని వార్తలు వచ్చాయి.
కాగా, బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2013లోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించినా.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఖాయం చేశారు. దీంతో బూర అసంతృప్తికి గురయ్యారు. అయితే, సీఎం కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని రాజీనామా సందర్భంలో బూర వ్యాఖ్యానించారు. అభిమానం వేరు.. బానిసగా ఉండటం వేరని ఆయన వ్యాఖ్యానించారు.