ప్రగతి భవన్ ఎదుట కలకలం-అన్నాదమ్ముల ఆత్మహత్యాయత్నం-కాసేపట్లో కేబినెట్ సమావేశమనగా
హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ఎదుట మంగళవారం(జూన్ 8) తీవ్ర కలకలం రేగింది. ఇద్దరు అన్నాదమ్ములు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.ఇద్దరిలో ఒకరు మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. మరొకరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. కేబినెట్ సమావేశానికి కొద్ది నిమిషాల ముందు జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మాట్లాడుతూ...'నా పేరు ములుగు నర్సింగరావు... మాది మేడ్చల్... కొంపల్లి సాయిబాబా నగర్ రోడ్ నంబర్.5లో ఉన్న ఇల్లు ప్రాపర్టీ మాదే... కానీ షేట్ బషీరాబాద్ సీఐ మహేష్ రౌడీయిజంతో మాపై దాడులు చేయిస్తున్నాడు. నా ఇంట్లోని టీవీ,ఫ్రిజ్ అన్నీ పోయాయి. నేను హైకోర్టు డ్రైవర్ను.ఈ వివాదం కారణంగా డ్రైవర్ ఉద్యోగం కూడా పోయింది.' అని చెప్పుకొచ్చాడు.
రౌడీ షీటర్ ఒకరు తమ ఇంటిని కబ్జా చేయగా... న్యాయం చేయాలని షేట్ బషీరాబాద్ సీఐ మహేష్ను ఆశ్రయించామని చెప్పాడు. అయినా తమకు న్యాయం జరగలేదని... పైగా రౌడీషీటర్తో సెటిల్మెంట్ చేసుకోమన్నారని ఆరోపించాడు. ఆ రౌడీ షీటర్తో పోలీసులు కుమ్మక్కై పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. ఈ వివాదంపై గతంలో డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నాడు. దయచేసి తమకు న్యాయం చేయాలని కోరాడు.
మరోవైపు పోలీసుల వాదన భిన్నంగా ఉంది. ఈ ఇద్దరూ గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారని పోలీసులు తెలిపారు. షేట్ బషీరాబాద్ ప్రాంతంలో వీరు భూకబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
కేబినెట్ సమావేశానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్రం కలకలం రేపింది. వచ్చీ రావడంతోనే ఇద్దరు అన్నాదమ్ములు ప్రగతి గేటు ఎదుట ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఇద్దరినీ రక్షించగలిగారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది.