బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్: కేసీఆర్ పార్టీపై వీహెచ్ విసుర్లు
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన సంగతి తెలిసిందే. చిన్న చితక పార్టీలు కూడా అందులో చేరుతున్నాయని తెలిసింది. అయితే విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు స్పందించారు. బీజేపీపై పోరాడడానికే బీఆర్ఎస్ ఏర్పాటు చేశానని కేసీఆర్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. బీజేపీతో డూప్ ఫైట్ చేయడానికే కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి బీఆర్ఎస్ బీజేపీకి ఒక బీ టీమ్ వంటిదని వీహెచ్ ఆరోపించారు. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే పార్టీ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో సంపాదించిన సొమ్మును ఇక దేశంలో ఖర్చు చేస్తారని విమర్శించారు.
కేసీఆర్ను దేశం పిలుస్తోందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏమీ చేయని కేసీఆర్, దేశంలో ఏదో చేస్తారని చెబితే ఎవరు విశ్వసిస్తారని ప్రశ్నించారు. విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసని చెప్పారు. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తానని చెప్పి సోనియా గాంధీని మోసం చేసిన చరిత్ర కేసీఆర్ సొంతం అని వీహెచ్ వెల్లడించారు.
కేసీఆర్ ఇప్పుడు దేశంలోని రైతుల గురించి మాట్లాడతున్నాడని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు. దేశంలో ఏ పార్టీ కూడా కేసీఆర్ కు సహకరిస్తుందని తాను అనుకోవడంలేదని అన్నారు.