ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు: బోనం సమర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి భక్తి పారవశ్యంతో బోనాలు సమర్పిస్తున్నారు. తమ కోరికలు తీర్చాలని కోరుకుంటున్నారు. జనమే కాకుండా ప్రముఖులు కూడా బోనాలు సమర్పిస్తున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి తొలిపూజలు నిర్వహించారు.
బోనం సమర్పించిన కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్రెడ్డి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. లష్కర్ మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలన్నారు. అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు.
బంగారు బోనం
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. రెండువేల మంది మహిళలతో ర్యాలీగా ఆలయానికి వచ్చారు. కవితకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తర్వాత బంగారు బోనం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి.. తీర్థప్రసాదాలు అందజేశారు. కవిత వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డితోపాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
అమ్మ.. ఇక చాలు
హైదరాబాద్కు ఆశీర్వాదం ఇవ్వాలని మహంకాళి అమ్మవారి కోరుకున్నానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ నివాసం నుంచి ఆమె బంగారు బోనంతో ఆలయానికి చేరుకుని, అమ్మవారికి సమర్పించారు. దక్షిణాదిలో పెద్ద ఎత్తున వానలు కురుస్తున్నాయని, వానలు తగ్గుముఖం పట్టాలని కోరుకున్నానని తెలిపారు. వరదలు కొన్ని జిల్లాలను దెబ్బతీస్తున్నాయని, వరద ప్రాంతాల వాసులు సురక్షితంగా ఉండాలని కోరుకున్నానని వివరించారు. గోదావరి తీరంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు.