4.6 లక్షల డోసులే కొనుగోలు.. 75 లక్షల డోసులు ఫ్రీ.. హరీశ్పై కిషన్ రెడ్డి ఆగ్రహాం..
కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా.. థర్డ్ వేవ్ మాత్రం గందరగోళానికి గురిచేస్తోంది. పిల్లలకు అని చెప్పడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. కరోనాకు విరుగుడు టీకాలేననే విషయం అర్థమవుతోంది. టీకా వేయించుకోవాలని వైద్యులు కోరుతుండగా.. తొలుత అబ్బే అన్న వారు కూడా ఇప్పుడు తమకు కావాలని అంటున్నారు. దీంతో అందరూ టీకాల కోసం ముందుకొచ్చారు. అదే సమయంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. ఇదే అంశంపై కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లను కూడా కేంద్ర సర్కారు కొనుక్కోనివ్వడం లేదన్నారు. ఆ కామెంట్లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. వ్యాక్సిన్లపై హరీశ్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉందని చెప్పారు. విదేశాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ ఇక్కడికి రావడం లేదా? అని నిలదీశారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి కేంద్ర సర్కారు వ్యాక్సిన్లను కొనుగోలు చేసి\ఇస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కొనుగోలు చేసింది నాలుగున్నర లక్షల డోసులేనని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 75 లక్షల డోసులు ఉచితంగా ఇచ్చిందని తెలిపారు. అందజేసిన వ్యాక్సిన్లను మరచిపోయి.. విమర్శించడం సరికాదని సూచించారు.
విమర్శ అనేది తీసుకునేలా ఉండాలి కానీ.. కామెంట్ చేసేలా ఉండొద్దని పేర్కొన్నారు. వివరాలతో ఆరోపణలు చేస్తే సమాధానం చెబుతామని చెప్పారు. కానీ చేసిన మంచిని, అందజేసిన వ్యాక్సిన్లను కూడా అంగీకరించకపోవడం మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తమ ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. ఇదివరకు మనం వ్యాక్సిన్ ఎగుమతి చేయగా.. ఇప్పుడు మనకు దిగుమతి అవుతున్నాయని వివరించారు.