బుద్ది ఎక్కువైతే కష్టమే.. గురుపౌర్ణమి నాడు చిన్నజీయర్ ఇలా చెప్పారేంటబ్బా..!
హైదరాబాద్ : మనిషికి కండబలం ఉంటే చాలదు బుద్ధిబలం కూడా ఉండాలంటారు పెద్దలు. మనస్సుతో సుఖఃదుఖాలు అనుభవిస్తాము. అదే మనస్సుతో స్థిత ప్రజ్ఞను సాధిస్తాము. బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటాము. అది మంచో చెడో బుద్ధి ప్రకారమే జరుగుతుంటాయి. బుద్దితోనే జ్ఞాన మార్గంలో సాధన చేస్తుంటాము. అయితే బుద్ధి ఎక్కువైతే కష్టమంటున్నారు చిన్నజీయర్ స్వామి. శంషాబాద్లోని ఆశ్రమంలో జరిగిన గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈవిధంగా మాట్లాడటం చర్చానీయాంశమైంది.
బుద్ది ఎక్కువైతే కష్టమేనా..!
శంషాబాద్ లొని చిన జీయర్ స్వామి ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన బుద్ది గురించి చెప్పిన నాలుగు మాటలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు బుద్ది తక్కువ వెధవ అని తిడుతుంటారు పెద్దలు. ఆ క్రమంలో బుద్ధి పెంచుకోవాలని కోప్పడుతుంటారు. కానీ చిన్నజీయర్ స్వామి బుద్ధి ఎక్కువైతే కష్టమని చెప్పుకొచ్చారు.
మనుషులు ఎవరైనా సరే సొసైటీలో తమకంటూ మంచి పేరు ఉండాలని కోరుకుంటారు. ఆ క్రమంలో బుద్దిబలంతో తమకు నచ్చిన మార్గంలో వెళుతుంటారు. బుద్దితోనే విజయాలు సాధిస్తూ ముందుకెళతారు. అలా బుద్దిబలంతోనే సమాజంలో తగిన గుర్తింపు పొందుతారు. అయితే బుద్ది ఎక్కువైతే ప్రమాదకరమని సందర్భోచితంగా చిన్నజీయర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మోడీ తీరు మారిందా.. బీజేపీ నేతలకు ఇక దబిడి దిబిడేనా?
వేదవ్యాసుడే బుద్ది మార్గాలకు పునాది
భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోని అన్ని దిక్కులా ఉన్న దేశాల్లో ఏ మూలన జ్ఞానానికి సంబంధించిన చర్చ జరిగినా, జరుగుతున్నా, జరగబోతున్నా.. అది వేదవ్యాస భగవానుడు వేసినటువంటి పునాది ఆధారంగా మాత్రమే ఏర్పడిందన్నారు చినజీయర్. అందులో లోతు తెలిసిన పెద్దలు ఇచ్చే ఆధికారికమైన నిర్ణయమని చెప్పుకొచ్చారు.
ఆ మహానీయుడి వల్ల ఇవాళ మానవ జాతి బుద్దిని వినియోగించుకుంటూ జీవిస్తోందని తెలిపారు. బుద్ది ఎక్కువైతే కూడా ప్రమాదమేనంటూ చక్కటి ఉదాహరణ సహితంగా వివరించారు. సన్నగా ఉండే మొక్క బాగా పొడవుగా పెరిగితే అది ఇటో అటో వాలే ప్రమాదం ఉన్నట్లుగానే.. మానవుడి యొక్క సునిశితమైన బుద్ధి క్రమక్రమంగా పెరిగితే అది ఎన్నో రకాలైనటువంటి వీపరీత పోకడలకు దారి తీస్తుందన్నారు. అలా అపమార్గం పట్టినటువంటి జ్ఞానం కూడా తిరిగి సరిచేసుకోవడానికి ఆ వ్యాస భగవానుడి యొక్క మార్గమే తిరిగి మనకు కనిపిస్తుందని చెప్పుకొచ్చారు.
బుద్ది ఎక్కువైతే అనర్థాలకు హేతువా?
మానవుడికి బుద్ది ఉండాలి. అది చాలా అవసరం కూడా. అయితే బుద్ది ఉన్నంతలో ఉంటే ఓకే. ఒకవేళ బుద్ది బాగా పెరిగి వీపరీత పోకడలకు దారి తీస్తేనే అసలు సమస్య మొదలవుతుంది. ఏ మనిషికైనా కొన్ని పరిధులుంటాయి. అందులోనే అతడు పరిభ్రమిస్తూ జీవనయానం చేయాల్సి ఉంటుంది. బుద్దిబలం ఉపయోగిస్తూ నలుగురిలో తనేంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అదే బుద్ధి బాగా ముదిరితే అనర్థాలకు దారి తీస్తుంది. బుద్ది పెరిగిన కొద్దీ మనిషిలో అహం పెరుగుతుందనే వాదనలు లేకపోలేదు. జ్ఞాన సముపార్జనతో, బుద్దిబలంతో ముందుకెళితే అపరిమిత విజయాలు సొంతమవుతాయి. అదే బుద్ధి ఎక్కువై అహంకారం ఆవహిస్తే మంచికన్నా చెడు జరిగే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంటుంది. మొత్తానికి చినజీయర్ స్వామి చెప్పిన బుద్ధికి సంబంధించిన నాలుగు మాటల పరమార్థం కూడా ఇదేనేమో.