లాక్ డౌన్ పొడగించాల్సిందే.. వాళ్లకు స్పెషల్ గిఫ్ట్.. : కరోనాపై కేసీఆర్ ప్రెస్‌మీట్ హైలైట్స్

కరోనా వైరస్ ప్రపంచ మానవాళికే అతిపెద్ద సంక్షోభాన్ని తీసుకొచ్చిందని.. ఇలాంటి తరుణంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. వెకిలితనం,చిల్లర చేష్టలు పక్కనపెట్టి గొప్ప ఔన్నత్యాన్ని ప్రదర్శించాలన్నారు. జరిగిందేదో జరిగిపోయిందని.. ఇప్పటికైనా అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సంక్షోభ సమయంలోనూ దుర్మార్గంగా,సంకుచితంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నవారికి కఠిన శిక్షలు తప్పవన్నారు. ఇలాంటి సమయంలో జాతిని ఏకం చేసేవాడు.. ప్రజలకు ధైర్యం చెప్పేవాళ్లే గొప్పవాళ్లని చెప్పారు. బీడీలు చుట్టుకుని బతికే మహిళ సైతం రూ.20వేలు విరాళం ఇచ్చిందని.. ఇప్పుడు సమాజానికి అలాంటి మహిళల అవసరం ఉందన్నారు. అదే సమయంలో లాక్ డౌన్ పొడగింపు.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కూడా సీఎం కేసీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

లాక్ డౌన్ పొడగించాలని విజ్ఞప్తి

లాక్ డౌన్ పొడగించాలని విజ్ఞప్తి

ఏప్రిల్ 15 తర్వాత లాక్ డౌన్ పొడగించాల్సిన అవసరం ఉందని.. ఇదే విషయాన్ని ప్రధాని మోదీతోనూ చెప్పానని సీఎం కేసీఆర్ చెప్పారు. అమెరికా లాంటి దేశాలతో పోల్చితే మన దేశ జనాభాకు సరిపడేంత వైద్య సదుపాయాలు లేవని.. కాబట్టి మనవద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం లాక్ డౌన్ అని పునరుద్ఘాటించారు. ఆర్థిక సంక్షోభం తలెత్తితే తిరిగి చక్కదిద్దుకోవచ్చునని... కానీ ప్రజలు చనిపోతే ఏర్పడే సామూహిక విషాదాన్ని నాగరిక సమాజం తట్టుకోలేదని స్పష్టం చేశారు. మానవ ప్రయత్నంగా వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నామని.. అయినప్పటికీ మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేస్తే.. ఎవరిని బయటకు వదలాలి,ఎవరిని నియంత్రించాలన్న విషయంలో సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లాంటి సంస్థలు కూడా భారత్‌లో ఉన్న పరిస్థితుల రీత్యా జూన్ 3 వరకు లాక్ డౌన్ పొడగించాలని రిపోర్ట్ ఇచ్చాయన్నారు.

డాక్టర్లు,పారిశుద్ధ్య కార్మికులకు సీఎం గిఫ్ట్

డాక్టర్లు,పారిశుద్ధ్య కార్మికులకు సీఎం గిఫ్ట్

సాధారణ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతీ రోజు రూ.430కోట్లు ఆదాయం వస్తుందని.. కానీ ఏప్రిల్‌లో గడిచిన ఆరు రోజుల్లో రోజుకు రూ.6 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. మార్చి నెలలో మొదటి 15 రోజులు సరిగానే ఆదాయం వచ్చిందని.. కానీ ఆ తర్వాత 15 రోజులకు అది ఖర్చయిపోయిందని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతున్నప్పటికీ.. మరోవైపు తక్కువ మరణాల రేటు కలిగి ఉండటం సంతోషం కలిగిస్తోందన్నారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ కంటే ఇప్పుడు ప్రజలే తమ ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. ఆర్థిక ప్రతికూలత ఉన్నప్పటికీ.. ఇలాంటి తరుణంలో ప్రాణాలను రిస్క్‌లో పెట్టి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి వారి గ్రాస్ సాలరీలో 10శాతం పెంచుతున్నట్టు తెలిపారు. సీఎం గిఫ్ట్ కింద దీన్ని అందించబోతున్నామన్నారు. అలాగే జీహెచ్ఎంసీ,హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రూ.7500 అదనపు వేతనం అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే మున్సిపాలిటీలు,గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న పారిశుద్ద్య కార్మికులకు రూ.5వేలు అదనపు వేతనం అందిస్తున్నట్టు తెలిపారు. ఇంత సంక్లిష్ట సమయంలో వారికి ఏమిచ్చినా తక్కువేనని.. మున్ముందు ప్రభుత్వం వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని తెలిపారు. డాక్టర్లు,పారిశుద్ద్య కార్మికులకు మరోసారి చేతులెత్తి మొక్కుతున్నానని తెలిపారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై

రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై

లాక్ డౌన్ చర్యల వల్ల ఇప్పటికైతే రాష్ట్రంలో,దేశంలో వైరస్ నియంత్రణలోనే ఉందని సీఎం తెలిపారు. భారత్ ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలు ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా కొనియాడాయని చెప్పారు.
జనాభా పరంగా చూసుకుంటే భారత్‌లో ఇప్పటివరకు నమోదైన 4314 కేసులు చాలా తక్కువేనని చెప్పారు. న్యూయార్క్ లాంటి నగరాల్లో శవాల గుట్టలను చూస్తుంటే మనసు చలించిపోతోందని.. అలాంటి పరిస్థితి మనకు రావొద్దని కోరుకుంటున్నానని తెలిపారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 25937 మందిని క్వారెంటైన్ చేశామని.. ప్రభుత్వ పర్యవేక్షణలో రకరకాల పద్దతుల్లో వారందరూ క్వారెంటైన్‌లో ఉన్నారని చెప్పారు. వీళ్లలో మొదటి దశలో 50 మందికి పాజిటివ్ వచ్చిందని.. ఇందులో విదేశాల నుంచి 30 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు. ఆ 30 మంది ద్వారా వారి కుటుంబ సభ్యులైన మరో 20 మందికి వ్యాప్తి చెందిందన్నారు. అదృష్టవశాత్తు వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అందులో 35 మంది డిశ్చార్జి అయ్యారని, మరో 15 మంది ఎల్లుండి డిశ్చార్జి అవనున్నారని తెలిపారు. ప్రస్తుతం మొత్తం 308 మంది కరోనా పాజిటివ్ పేషెంట్స్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మరో 8 కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. కోటీశ్వరులైనా.. సామాన్యులైనా కరోనా సోకితే గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స ఉంటుందన్నారు.

Recommended Video

    AP CM Jagan, CM KCR And Chandrababu Naidu Light Candles, Diyas
    వైరస్ తీవ్రత ఎంతలా ఉందంటే..

    వైరస్ తీవ్రత ఎంతలా ఉందంటే..

    నిజాముద్దీన్ సంఘటన తర్వాత కేసులు సంఖ్య పెరిగిపోయిందని సీఎం అన్నారు. మర్కజ్ వెళ్లి రాష్ట్రానికి వచ్చిన 1038 మందిని ఇప్పటికే గుర్తించి క్వారెంటైన్ చేశామన్నారు. ఇంకా ఎవరైనా ఇప్పటికీ రిపోర్ట్ చేయకపోతే స్వచ్చందంగా ముందుకు రావాలన్నారు. నిజాముద్దీన్ మర్కజ్ కేసులను గుర్తించేందుకు ఇంటలిజెన్స్ టీమ్ నిద్రలేని రాత్రులు గడుపుతూ తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. వైరస్ తీవ్రత ఎంతలా ఉందో చెప్పేందుకు ఓ ఉదాహరణ వివరించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రి నుంచి సీఎంవో కార్యాలయానికి ఫోన్ కాల్ వచ్చిందని.. ఇద్దరు సీరియస్ ఉన్నారని అధికారులు చెప్పారన్నారు. ఆ తర్వాత కాసేపటికే ఒకరు చనిపోయినట్టు ఫోన్ కాల్ వచ్చిందని.. మరికాసేపటికే మరొకరు కూడా చనిపోయారని మరో ఫోన్ కాల్ వచ్చిందన్నారు. వైరస్ లోడ్ ఎక్కువగా ఉండటం వల్లే ఆ పరిస్థితి తలెత్తిందని.. వెంటిలేటర్ పెట్టుదామనుకునేలోపు చనిపోతున్నారని చెప్పారు. కాబట్టి ప్రజలంతా స్వీయ నియంత్రణలో ఉండాలని ప్రజలంతా మరింత సహకారం అందించాలని కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+