రిజిస్ట్రేషన్ సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
అవినీతికి తావులేకుండా ప్రజలు తామంతట తామే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్లు పారదర్శకంగా జరగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని ఆయన స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్కు ఎలాంటి ఆటంకాలు కలగరాదని సీఎం స్పష్టం చేశారని తెలిపారు.
దాదాపు 100 రోజుల విరామం తరువాత సీఎస్, అధికారులు అవిశ్రాంతంగా కృషి చేశారని మంత్రి తెలిపారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి తీసుకు వచ్చారన్నారు. చిన్న అవరోధాలు అధిగమిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. సమస్యలకు సంబంధించి.. సూచనలు, సలహాలు తీసుకుని సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు.
రద్దీ ఆధారంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నాలుగు విభాగాలుగా చేశామని తెలిపారు. బాగా డిమాండ్ ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తక్కువ రిజిస్ట్రేషన్ అయ్యే కార్యాలయాలుగా వర్గీకరించామని వివరించారు. రద్దీగా ఉన్న కార్యాలయాలకు ఎక్కువ మంది రిజిష్ట్రార్లు, సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు.
మార్చి వరకు ఎలాంటి పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని వర్గాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించామని తెలిపార. వారం రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.