అసెంబ్లీ అంటే దూషణలు కాదు.. నిర్మాణాత్మక చర్చ జరగాలి: మంత్రులు, విప్లతో కేసీఆర్
వచ్చే సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో మంత్రులు, విప్లతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ చర్చించారు. అసెంబ్లీలో జరిగే చర్చలో వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మంత్రులు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ప్రతిపాదించిన అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ అన్నారు. ప్రజలకు సంబంధించి ప్రతి విషయం సభలో డిస్కష్ చేయాలని కోరుకుంటున్నామని చెప్పారు.
అసెంబ్లీ అంటే దూషణలు, శాపనార్థాలు కాదని కేసీఆర్ అన్నారు. నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కావొద్దని అభిప్రాయపడ్డారు. సభలో చర్చ స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరారు. వాస్తవాల ఆధారంగా చర్చ జరగాలని కేసీఆర్ అభిలషించారు. ప్రజాస్వామ్య విలువలు వెల్లివిరిసేలా, దేశానికే ఆదర్శంగా ఉండేలా సభా సమావేశాలు జరగాలని మంత్రులు, విప్లతో అన్నారు.
Recommended Video
బీఏసీ సమావేశంలో ప్రభుత్వం పరంగా చర్చకు ప్రతిపాదించిన అంశాల జాబితా పెద్దదిగానే ఉంది. కరోనా వ్యాప్తి-నివారణ, కరోనా బాధితులకు వైద్య సేవలు, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం-సహాయక చర్యలు, శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటన, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, నీటి పారుదల రంగం అంశాలు, పీవీ శతజయంతి ఉత్సవాలు, నియంత్రిత పద్ధతిలో పంటలసాగు తదితర అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఏయే అంశాలపై చర్చ రచ్చ లేకుండా జరుగుతుందో చూడాలీ మరీ.