కేసీఆర్ తదుపరి లక్ష్యం ఏమిటి... లోక్సభ ఎన్నికలకు గులాబీ బాస్ వ్యూహమేంటి..?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎలాగైతే అసెంబ్లీలో ఘనవిజయం సాధించిందో 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా విజయఢంకా మోగించాలని భావిస్తోంది. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ అప్పుడే మొదలెట్టినట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వ్యక్తిగతంతా దీన్ని సమీక్షిస్తున్నట్లు సమాచారం. మరి లోక్సభ ఎన్నికలకు సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యూహం రచించబోతున్నారు... అత్యధిక సీట్లు నెగ్గడం ద్వారా దేశ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు..?
2019 ఎన్నికలపై గులాబీ బాస్ గురి
ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించి చరిత్ర తిరగరాసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక తన తదుపరి టార్గెట్గా 2019 లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు సీట్లు ఉండగా అందులో 16 సీట్లను గెలుచుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి దేశ రాజకీయ ముఖ చిత్రంలో ఒక ఐకాన్గా కేసీఆర్ నిలిచారు. ఇక తన విజయం తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాను దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉందని చెప్పిన గులాబీ బాస్ ఆ మార్పునకు తనే ముందడుగు వేయబోతున్నట్లు చెప్పారు. అంతకంటే ముందు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి దేశరాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
సరిగ్గా ఒంటిగంట 25 నిమిషాలకు.. కేసీఆర్ అనే నేను...
లోక్సభ స్థానాల్లో మార్పులు చేర్పులు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టీఆర్ఎస్ నేతలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వారు ఓడిపోయినప్పటికీ వారికి ఎలాగో అలాగా మరో అవకాశం కల్పించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి గెలుపొందిన కొండా విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో అక్కడ ఎంపీ సీటుకు టీఆర్ఎస్ అభ్యర్థికి లైన్ క్లియర్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీమంత్రి పట్నం నరేందర్ రెడ్డిని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ను అసెంబ్లీకి పంపి ఆ స్థానంలో మాజీ ఎంపీ గడ్డం వివేక్ను పోటీలో నిలపనున్నారు గులాబీ బాస్. మరో ఎంపీ మల్కాజ్గిరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లారెడ్డిని కూడా అసెంబ్లీకి పంపారు. ఇక్కడ కూడా ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తిని పార్లమెంటుకు పంపాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఎక్కడికక్కడ మార్పులు చేర్పులు చేసి 16 లోక్సభ సీట్లపై గులాబి అధినేత కన్నేసినట్లు సమాచారం.
ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి భారీ వలసలు..?
ఇదంతా ఒక వైపు ఉంటే... మరోవైపు పలు పార్టీలలో నుంచి టీఆర్ఎస్లోకి భారీ చేరికలు ఉంటాయనే సమాచారం అందుతోంది. ఈ విషయం కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఈ చేరికలన్నీ కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి ఉంటాయని సమాచారం. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ కనిపించడంలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది.
మొత్తానికి టీడీపీ భవిష్యత్తులో తెలంగాణలో ఉండదని కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్లుగానే పరిణామాలు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి కూడా టీఆర్ఎస్లోకి వలసలు భారీగా ఉంటాయని తెలుస్తోంది. ఇలా అందరినీ కలుపుకుపోయి కేసీఆర్ 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి దేశ రాజకీయాల్లో పవర్ సెంటర్గా నిలవాలని భావిస్తున్నారు. అదే జరిగితే తాను అనుకుంటున్నట్లుగా కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్యేతర ప్రభుత్వాలకు ధీటుగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.