ఈ సమయంలో సమ్మెనా..? జూడాలపై కేసీఆర్ ఆగ్రహాం.. వ్యాక్సిన్ హబ్గా గ్రేటర్: కేటీఆర్
జూనియర్ డాక్టర్లపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం సరికాదన్నారు. కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు. తక్షణమే విధులకు హాజరుకావాలని కేసీఆర్ సూచించారు. వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. సమ్మె పేరుతో విధులు బహిష్కరించడం సరైన పద్ధతి కాదన్నారు.
సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం 15 శాతం పెంచాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ సేవల్లో ఉన్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనమే అందించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే జూడాలకు మెరుగైన స్టైఫండ్ ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. జూడాలు సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదని చెప్పారు. జూడాలు సమ్మె విరమించాలని, లేకుంటే తదుపరి చర్యలుంటాయని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్గా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయినా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాల్సి వచ్చిందన్నారు. వ్యాక్సిన్పై కేంద్రం కలగజేసుకోకపోవడం వల్లే కొరత ఏర్పడిందని విమర్శించారు. కోటి వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం నుంచి కరోనా టీకా పంపిణీ పునఃప్రారంభమయిన సంగతి తెలిసిందే.
కొవిషీల్డ్ రెండో డోసు పొందేందుకు అర్హులైనవారు దగ్గరలోని వాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకోవాలని అధికారులు కోరారు. సోమవారం రాష్ట్రానికి 2.45 లక్షల కొవిషీల్డ్ టీకాలు వచ్చాయని ఆయన వివరించారు. ఇవన్నీ కూడా కేంద్రం కోటాలోనివేనని వైద్య వర్గాలు తెలిపాయి. వీటితో కలిపి కొవిషీల్డ్ నిల్వల సంఖ్య పది లక్షలకు చేరింది. ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాలు 50 వేలే ఉన్నాయని... నెలాఖరు నాటికి మరో రెండు లక్షల డోసులు వస్తాయని సమాచారం.