అంబానీని తలదన్నేలా కేసీఆర్ సంపద -మణికం ఠాకూర్ ఫైర్ -చస్తేనే దేవుడితో కొట్లాడగలమన్న జగ్గారెడ్డి
ఏమీ లేని స్థితి నుంచి వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదనకు మరిగారని.. ఇప్పటికే దేశంలోని రాజకీయ నేతల్లో ధనికుడిగా ఉన్న కేసీఆర్.. రాబోయే రోజుల్లో రిలయన్స్ ముఖేశ్ అంబానీని సైతం మించిపోతారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మణికం ఠాకూర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అది వ్యాపారం.. ఇది అక్రమం..
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చట్ట ప్రకారం వ్యాపారం చేస్తూ సంపాదిస్తుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం చట్టవిరుద్ధంగా అన్ని పనులకు కమిషన్లు బొక్కుతూ సంపద పోగేస్తున్నారని, కాబట్టి ముఖ్యమంత్రిని కల్వకుంట్ల చంద్రశేఖర్ అని పిలవడం కంటే కమిషన్ల చంద్రశేఖర్ అని వ్యవహరించాలని కార్యకర్తలకు మణికం ఠాగూర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు వెనకున్న అసలు లక్ష్యాన్ని, ఉద్దేశానికి కేసీఆర్ కుటుంబం తూట్లుపొడిచిందని ఆయన అన్నారు.

సోనియమ్మ కల ఇది..
తెలంగాణలోని ప్రతి వ్యక్తికి మేలు జరగాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ నాడు రాష్ట్రాన్ని ఇచ్చారని, అయితే, ఆమె కల ఇంకా నెరవేరలేదని, రాష్ట్రంలో అధికారం మొత్తం అధికారం మొత్తం కేసీఆర్, ఆయన కొడుకు, కుమార్తె, అల్లుడి చేతిలోనే ఉందని కాంగ్రెస్ ఇంచార్జి ఠాగూర్ అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అతలాకుతలం అయిందని, తిరిగి రాష్ట్రానికి సుపరి పాలన అందిచడం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు.

టార్గెట్ 2023..
‘‘ఇందిరమ్మ నామినేషన్ వేసిన చోటు మెదక్.. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా ఇక్కడి నుంచే కార్యకలాపాలను మొదలుపెట్టాను. కేసీఆర్ కుటుంబ పాలనకు చెరమగీతం పాడుతూ.. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే నేను ఇక్కడికి వచ్చాను. మనమంతా అదే లక్ష్యంతో ముందుకు వెళదాం. విజన్ 2023 లక్ష్యంగా సాగుదాం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 79 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునేలా మనందరం కష్టపడదాం'' అని మణికం ఠాగూర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Recommended Video

చచ్చాకే దేవుడితో పోరాటం
ఏపీ జల చౌర్యాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణ వ్యవసాయ రంగం, రైతుల రక్షణ కోసం ఆ దేవుడితోనైనా సరే కొట్లాడుతానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఏఐసీసీ ఇన్ చార్జి మణికం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజనర్సింహా తదితర నేతలతో కలిసి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన ఆయన.. దీక్షలో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ దేవుడితో కొట్లాడుతా అంటున్నాడు.. కానీ, అది మనిషి చనిపోతేనే సాధ్యమవుతుంది''అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో కాంట్రాక్టులు, కమీషన్లు, కుట్రలు చేస్తున్నారని, ఇంతటి అబద్ధాల సీఎంను దేశంలో ఎక్కడా చూడలేదని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications