కాంగ్రెస్ కూడా రెడ్డిలకే టికెట్లు : స్థానిక సంస్థల స్థానాల బరిలో అభ్యర్థులు వీరే
హైదరాబాద్ : తెలంగాణ గట్టు స్థానిక సంస్థల మండలి పోరుకు సిద్ధమవుతుంది. 3 సీట్లకు జరిగే ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డికి టికెట్లు ఖరార చేసి బీ ఫారాలు కూడా అందజేశారు. వారు రేపు నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది.
వీరే అభ్యర్థులు ...
గెలుపుగుర్రాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా టీపీసీ హైకమాండ్ జాబితా పంపించింది. ఆ లిస్ట్ అధిష్టానం ఆమోదముద్ర వేసింది. నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ, వరంగల్ స్థానిక సంస్ల నియోజకవర్గం నుంచి పరకాల నియోజకవర్గ నేత ఇనుగులు వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఉదయ్ మోహన్ రెడ్డి పేరును ఖరారు చేసింది.
ఆచితూచి ఎంపిక
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కావాలసిన సంఖ్య ఉందని, విజయం తమదేనని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అందులోభాగంగా అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు. నియోజకవర్గాల వారీగా నేతలు, కార్యర్తలు, ముఖ్యుల అభిప్రాయం తీసుకొని వారి పేర్లను ఖరారు చేశారు. కానీ తాము కూడా గెలుస్తామని .. తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులతో ఒక సీటు సాధిస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతామని చెప్పడం .. ఆ పార్టీకి ప్రతికూలంశంగా మారనుంది.
రెడ్డిలకే ఛాన్స్
దీంతోపాటు ఈసారి విచిత్రంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ తమ టికెట్లను రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకు ఇచ్చారు. మూడు సీట్లలో టీఆర్ఎస్ పార్టీ రెడ్డి నేతలకు టికెట్ ఇవ్వగా ... కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానం పాటించినట్టుంది. మొత్తానికి ఏ పార్టీ తరఫున అభ్యర్థులు గెలిచినా .. మండలిలో రెడ్డి ఎమ్మెల్సీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.