రాజగోపాల్ రెడ్డితో సంబంధం లేదు.. నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా: వెంకట్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడూ వస్తాయో తెలియదు.. కానీ ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. అవును ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే అవీ ప్రయత్నాలను చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ రెబల్.. ఈ మధ్య రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. పార్టీని వీడతాననే విధంగా కామెంట్ చేస్తున్నారు. దీనిపై అతని సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.
తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. తన తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. తాను పార్టీని వీడటం లేదని.. అభివృద్ది పనుల కోసం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిసానని చెప్పారు. మోడీని కలిస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యం అని చెప్పారు. ఇంట్లో ఎన్నో గొడవలు ఉంటాయని.. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉండటం సహజమేనని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలో తమ కన్నా ఎక్కువ గొడవలు ఉన్నాయని చెప్పారు.
ఢిల్లీలో రేవంత్ రెడ్డితో కలిసి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పార్టీని వీడనని చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు. సింగరేణి టెండర్లలో అవకతవకలపై కోర్టుకు వెళ్తామని రేవంత్ చెప్పారు. అందులో కేసీఆర్ సంబంధికులకే కాంట్రాక్టులు దక్కాయని చెప్పారు. రూ.50 వేల కోట్ల కాంట్రాక్టును ఒకే సంస్థకు అప్పగించారని ఆరోపించారు. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని చెప్పారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ను ఎనిమిదేళ్లుగా ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ చేస్తున్న దోపిడీకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని మండిపడ్డారు.
టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ పోరాటం చేయడం లేదని చెప్పారు. అదంతా బూటకమేనని వివరించారు. ధాన్యంపై బీజేపీ, టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. అమిత్ షా, కేసీఆర్ ఒవైసీ కలిసి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.