తెలంగాణలో పెరిగిన కరోనా మరణాలు: ‘18ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇప్పుడే కాదు’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, గత రెండు మూడు రోజులతో పోలిస్తే బుధవారం కొత్త కరోనా కేసులు కొంతమేర తగ్గాయి. అదే సమయంలో మరణాలు మాత్రం పెరిగాయి. రాష్ట్రంలో బుధవారం 80.181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 7994 మందికి కరోనా సోకినట్లు తేలింది.

తెలంగాణలో కొత్తగా 7994 కరోనా కేసులు, 58 మరణాలు
తాజాగా నమోదైన 7994 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,27,960కి చేరింది. కరోనా బారినపడి 58 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 2208కి చేరింది. బుధవారం 4009 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,49,692కు చేరింది.

76వేలు దాటిన యాక్టివ్ కేసులు
తెలంగాణలో రికవరీ రేటు 81.71 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. రాష్ట్రంలో బుధవారం వరకు 1,28,28,763 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 76,060 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1630 కరోనా కేసులు వెలుగు చూడగా, మేడ్చల్ మాల్కాజ్గిరి జిల్లాలో 615, రంగారెడ్డిలో 558 కేసులు నమోదయ్యాయి. నల్గొండలో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాద్ లో 301, సిద్దిపేటలో 269, మహబూబ్నగర్లో 263, జగిత్యాలలో 238, ఖమ్మంలో 213, సూర్యపేటలో 207, వికారాబాద్లో 207, నాగర్ కర్నూల్లో 206, మంచిర్యాల జిల్లాలో 201 కరోనా కేసులు వెలుగుచూశాయి.

18ఏళ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ ఇప్పుడు కాదు
ఇది ఇలావుండగా, 18 ఏళ్లు నిండినవారికి మే 1 నుంచి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్రం ప్రకటించినా.. వెంటనే టీకాలు ఇవ్వడం సాధ్యం కాదని, రాష్ట్రంలో మరికొంత సమయం పడుతుందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముందుగా 18 ఏళ్లుపైబడినవారు టీకాల కోసం తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 45 లక్షల మందికి టీకాలు అందించామని తెలిపారు. వ్యాక్సిన్ లభ్యతను బట్టి మిగితా వారందరికీ అందిస్తామని చెప్పారు. కరోనా మొదటి డోసు తీసుకున్న కేంద్రంలోనే రెండో డోసు తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదని.. ఎక్కడైనా తీసుకోవచ్చన్నారు.
Recommended Video

మరో 4 వారాలు జాగ్రత్త.. నిర్లక్ష్యం వద్దు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు శ్రీనివాసరావు. వచ్చే 4 వారాలు అత్యంత కీలకమైనవని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కట్టడి సాధ్యమని అన్నారు. కరోనా పట్ల ఎవరూ నిర్లక్షంగా ఉండకూడదన్నారు. కరోనా లక్షణాలుంటేనే ఆస్పత్రులకు వచ్చి కరోనా పరీక్షలు చేసుకోవాలని, అనవరంగా వచ్చి ఆస్పత్రుల వద్ద రద్దీని సృష్టించవద్దని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications