గుడ్ న్యూస్: సెప్టెంబర్ చివరినాటికి హైదరాబాద్లో కరోనా తగ్గుముఖం, బిల్లు ఎక్కువేస్తే చర్యలు
గత కొద్దిరోజులుగా గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు తక్కువగా వస్తున్నాయి. అయితే ఇవీ వచ్చేనెల చివరి వరకు ఆశించినస్థాయిలో ఉండనున్నాయి. ఇందుకు కారణం కరోనాపై ప్రజలకు పూర్తి అవగాహన రావడమేనని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు తెలిపారు. ఇలానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
ఎవరైనా సరే బయటకు వెళితే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. దీంతోపాటు భౌతిక దూరం కూడా పాటించాలని సూచించారు. ఇదివరకటితో పోలిస్తే కరోనా పరీక్షల సంఖ్య పెంచామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 10.21 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనల మేరకే కరోనా చికిత్స అందిస్తే బిల్లు తీసుకోవాలని స్పష్టంచేశారు. దీనిపై ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు హెచ్చరించారు.
కరోనా మరణాల రేటు జాతీయస్థాయి సగటు కన్నా తెలంగాణలో తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ర్షాకాలం నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డెంగీ వంటి సీజనల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా, సీజనల్ జ్వరాల లక్షణాలు ఒకేలా ఉంటాయని, ఎలాంటి లక్షణాలు కనిపించినా సమీపంలోని పీహెచ్సీకి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని శ్రీనివాసరావు కోరారు.